Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్ లో మరో ముందడుగు: ముడి ఇనుము సరఫరాకు కేంద్రం లైన్ క్లియర్
కడప: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు పడింది. ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోయే భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేయడానికి లైన్ క్లియర్ అయింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులను జారీ చేసింది. ఫలితంగా- ముడి ఇనుమును సరఫరా చేయడానికి ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేసే జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ముందుకొచ్చింది.
ఎన్ఎండీసీతో ఎంఓయు..
ఈ మేరకు ఎన్ఎండీసీ, ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ అధికారుల మధ్య పరస్పర అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందాలపై ఎన్ఎండీసీ డైరెక్టర్ (వాణిజ్యం) అలోక్ కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పీ మధుసూదన్ సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీల సమక్షంలో వారు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సంతకాలు చేసిన అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం బదలాయించుకున్నారు.
23న శంకుస్థాపన..
కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పెద్దదండ్లూరు-సున్నపురాళ్ల పల్లి గ్రామాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించబోతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన వైఎస్ జగన్ ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. ముడి ఇనుమును సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో.. ఇక నిర్మాణ పనులపై ఎలాంటి అనుమానాలు ఉండబోవని తెలుస్తోంది.
ముడి ఇనుము అత్యవసరం..
ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలంటే ముడి ఇనుము సరఫరా అత్యవసరం. ముడి ఇనుము సరఫరా బాధ్యతలను ఎన్ఎండీసీ పర్యవేక్షిస్తోంది. ముడి ఇనుము లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదు. కేంద్రం ఇప్పటికిప్పుడు ముడి ఇనుమును కేటాయిస్తుందా? అనే అనుమానాలు మొదట్లో తలెత్తాయి. ఇదివరకే వైఎస్ జగన్ తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలుసుకున్నారు. డీపీఆర్ లను అందజేశారు.
ఏటా మూడు మిలియన్ టన్నులు..
కొద్ది రోజుల కిందటే ఆయనే స్వయంగా అమరావతికి వచ్చి, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఆ కొద్దిరోజులకే ముడి ఇనుమును సరఫరా చేయడానికి అనుమతులను మంజూరు చేసింది. 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో దీన్ని నిర్మించనుంది.