బచ్చాగాడు, బుడ్డర్ఖాన్: రేవంత్ రెడ్డిపై నాయిని
హైదరాబాద్: తమ ప్రభుత్వం వందరోజుల పాలనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిపక్షాల నేతలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని బచ్చాగాడుగా ఆయన అభివర్ణించారు. హైదరాబాదులోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆదివారంనాడు నాయిని, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆధ్వర్యంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా నాయిని రేవంత్ రెడ్డిపై ఆ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభలో రేవంత్ రెడ్డిని ఆయన బుడ్డర్ఖాన్గా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డిలపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణానికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ను విమర్శించేవారు అడ్రస్ లేకుండా పోతారని ఆయన అన్నారు. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడితే మనం మాట్లాడేదేం లేదని, రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారో, రేవంత్ రెడ్డిని అనవసరంగా పెద్ద నేతను చేస్తున్నారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి బచ్చాగాడు అని, ఆ బచ్చాగాడి గురించి మనం ఊకే ఎక్కువ మాట్లాడడడం అనవసరమని ఆయన అన్నారు,
కెసిఆర్ని తిడితే ఎవడో పెద్ద లీడరైతననుకుంటే అది రేవంత్ రెడ్డి భ్రమ అని, కేసీఆర్ని తిట్టినోడు అడ్రస్ లేకుండపోతడని, కేసీఆరు ఆయన సొంతం కొరకేం జేస్తలేడని నాయిని స్పష్టం చేశారు. తన పార్టీ నేతలతో మాట్లాడించడం కాకుండా తానే స్వయంగా మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన సూచించారు.
ఈనాడు చంద్రబాబు రాజకీయాల్లో విడిపోయారని, మన తెలంగాణ నుంచి పోయాడని, చంద్రబాబు ఆంధ్రలో ఉన్నాడని, ఆ ప్రాంతాన్ని చంద్రబాబును అభివృద్ధి చేసుకోమను అని, మన ప్రాంతం మనం అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఒకరికొకరికి సహకారాలందించుకుందాం గానీ ఊకే గిచ్చికయ్యం పెట్టుకుంటే చేసుకున్న భార్య కూడ ఉండదని ఆయన అన్నారు.
చంద్రబాబు కరెంటు మీద అడ్డుపడతడు, ఇంకేదో అడ్డం పడతడని, వానితోటి ఒకటి అనిస్తడు.. వీనితోటి ఒకటి అనిస్తడని నాయిని అన్నారు. ఉంటే ఏదైనా చంద్రబాబు నేరుగా మాట్లాడాలని, చంచాగాళ్లతో ఎందుకు మాట్లాడిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని అవినీతి కుంభకోణాలు ఎప్పుడూ జరగలేదని, ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తామని ఆయన అన్నారు. దోపిడీదారుల కుట్రలనుబయట పెడతామన్నారు. లంచాలకు మంచాలేశారంటూ పొన్నాల లక్ష్మయ్యనూ నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
కార్యకర్తలే పార్టీ సారథులని కె.కేశవరావు అన్నారు. నవ తెలంగాణ నిర్మాణమే ఏకైక లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని, అన్ని వర్గాల సహకారం లభించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారని, ఆయన డైరెక్షన్లోనే తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆరోపించారు.