పోలీసులకి నాయిని, రేవంత్ ఫైర్, కేసీఆర్ రికార్డ్స్ అని..
పోలీసులు ఉత్తమ సేవలతో ప్రజల మన్ననలు పొందాలన్నారు. ప్రజల పోలీస్ స్టేషన్ అనేలా ఉండాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పోలీసులు వ్యవహరించాలన్నారు. తప్పు చేస్తే వదలు అనే భయం నేరస్తుల్లో ఉండేలా పని చేయాలన్నారు. పోలీసులకు జీతభత్యాలు పెంచుతామన్నారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాలన్నదే తమ ఆలోచన అన్నారు.
కేసీఆర్ పైన పొన్నాల విసుర్లు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విసుర్లు వేశారు. కేసీఆర్ తన పాలనలో అన్నీ రికార్డులే సృష్టిస్తున్నారన్నారు.
109 రోజుల పాలనలో అసలు పనే మొదలు పెట్టక పోవడం మొదటి రికార్డ్ అన్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడం రెండో రికార్డ్ అన్నారు. మెట్రో ప్రాజెక్టును కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఫాస్ట్, ఫీజు రీయింబర్సుమెంట్స్, నెంబర్ ప్లేట్ల మార్పిడిపై కోర్టు వ్యాఖ్యలు కేసీఆర్ రికార్డ్ అన్నారు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం
సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికలో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోకు చెందిన భూమార్పిడి పైన గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న రేవంత్.. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రామేశ్వర రావుకు భూములు కేటాయించాలని నివేదికలో ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ సన్నిహితుడు కాబట్టే ఆయనకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించారని, ఆయనకు రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారన్నారు.
ఏపీఐఐసీ కోరిన 3 కోట్ల 65 లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో ఐదంతస్తుల భవనాలను తెలంగాణ ప్రభుత్వం కూల్చిందని, అదే రామేశ్వర రావు అనుకున్న దానికి క్షణాల్లో సీఎం సంతకం పెడుతున్నారన్నారు.