ఈగ వాలనీయం: సీమాంధ్రులకు హోం నాయిని హామీ
అవినీతి అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలపైనా తమ పోరాటం తప్ప సామాన్య ప్రజలపై కాదన్నారు. నక్సల్స్పై నిషేధాన్ని ఎత్తివేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. నక్సలైట్ల ఎజెండాలోని 80 శాతం అంశాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. మహిళలపై యాసిడ్దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని నాయిని హామీ ఇచ్చారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. నగరంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వాటి కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
ముంపు పేరిట అంగుళం భూమిని కూడా వదులుకునేది లేదని, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం అడ్డదారిన ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, అవసరమైతే న్యాయపోరాటాలకు సిద్ధమని నాయిని, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆరు రోజులుగా భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేసి నిమ్స్ తరలించిన విషయం తెలిసిందే. రాజయ్య ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగించడంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు, మంత్రులు నాయిని, ఈటెల మంగళవారం ఆయనను కలిశారు.
ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమని, ప్రజల సంక్షేమం దృష్ట్యా దీక్షను విరమించాలని కోరడంతో రాజయ్య అంగీకరించారు. అనంతరం మంత్రులు రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
బాధ్యతలు స్వీకరించిన ఈటెల
ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు ఉద్యోగ సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.