మీ వాళ్లను కంట్రోల్లో పెట్టు, పిచ్చోళ్లమా: బాబుకి నాయిని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి తదితరులు శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిషోర్ బాబు, గంటా శ్రీనివాస రావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు మీ మంత్రులను కంట్రోల్లో పెట్టుకో అంటూ నాయిని హెచ్చరించారు.
సచివాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకే ఫీజులు చెల్లించేలా 1956 స్థానికత నిబంధనను తమ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు, న్యాయ సూత్రాలకు లోబడి ప్రకటించిందన్నారు. దీనిపై ప్రశ్నించే హక్కు ఏపీ మంత్రులకు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మీరే ఫీజులు చెల్లించుకోండన్నారు. రూ.లక్షన్నర కోట్లతో రాజధాని నిర్మించుకునే వారు తమ పిల్లలకు ఫీజులు చెల్లించలేరా? అని ఎద్దేవా చేశారు.

తమ ప్రజలు, తమ విద్యార్థుల బాగోగులుతాము చూసుకుంటామని, మీ ప్రజలు, మీ విద్యార్థుల బాగోగులు మీరే చూసుకోవాలని హితవు పలికారు. అది చేతగాక, ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ను విమర్శిస్తే సహించబోమన్నారు. ఒక్క ఫీజుల విషయంలో స్థానికతను తాము ప్రకటించామని, కానీ ఆంధ్రప్రదేశ్ నేతలు తమకు మరికొన్ని ఆలోచనలు వచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు.
విశ్వనగరం కోసమే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నామని, చిన్న చిన్న ఇళ్లకు మినహాయింపు ఇవ్వాలని సీఎంను కోరతామని చెప్పారు. బియాస్ నదిలో ప్రమాదం జరిగినప్పుడు తాను పది రోజులు అక్కడే ఉండి పర్యవేక్షించానని, ఆంధ్రప్రదేశ్ వారు మాత్రం పిక్నిక్కు వచ్చినట్లు వచ్చి వెళ్లారన్నారు. ఈ బాధిత కుటుంబాలకు తాము పరిహారం కూడా అందజేసిందని, ఏపీ ప్రభుత్వం ఇంకా ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్లో గవర్నర్కు అధికారాలు కట్టబెట్టాలని ఏపీ టీడీపీ నేతలు ఢిల్లీ పాలకులకు, వెంకయ్యకు చెబుతున్నారని, ఇలా అధికారాలు కట్టబెడితే మేం ఊరుకుంటామా? మేం పిచ్చివాళ్లమా? గవర్నర్ కేంద్రానికి-రాష్ర్టానికి మధ్యవర్తిగానే వ్యవహరించాలన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపే విషయంలో ప్రధాని మోడీ కూడా అమానుషంగా వ్యవహరించారన్నారు. వీటిని ఏపీలో కలపకుండా అఖిలపక్షంగా ఢిల్లీ వెళదామని తమను ఎవరూ కోరలేదన్నారు.












Click it and Unblock the Notifications