సర్వే: ఏపీలో బిజెపికి పెరిగిన మద్దతు, దక్షిణాదిన 50 సీట్లు గ్యారంటీ
హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే పాగా వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఓసారి కర్ణాటక రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపి.. ఇప్పుడు ఆ రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రెండు దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది.
ఈ క్రమంలో బిజెపి ప్రభావంపై ఏబిపి న్యూస్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రావడం గమనార్హం. నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రమంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకుంటోందని ఏబీపీ న్యూస్, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే పేర్కొంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పడనున్న ఓట్ల సంఖ్య 2014తో పోలిస్తే గణనీయంగా పెరగనుందని తెలిపింది. ఆంధ్రాప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 50 సీట్లు, 35 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 342 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా, 2014 ఎన్నికలతో పోలిస్తే యూపీఏకు వచ్చే సీట్లు 62 నుంచి 66కు పెరగవచ్చని అంచనా వేసింది. లెఫ్ట్ పార్టీలకు 14 స్థానాల వరకూ దక్కవచ్చని వెల్లడించింది.
ఇప్పటివరకూ దేశానికి ప్రధానులుగా వ్యవహరించిన వారిలో మోడీకి మొదటి స్థానాన్ని, ఆపై ఇందిరాగాంధీకి, అటల్ బిహారీ వాజ్పాయికి ప్రజలు మద్దతు పలికారని తెలిపింది. మోడీ చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా మెజార్టీ ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications