బాబు.. కెసిఆర్ ఇంటికెళ్లారని సంతోషించా, ఏపీ-తెలంగాణ వేరైనా: తెలుగులో మోడీ
అమరావతి: రాజధాని అమరావతి శంకుస్థాపన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రియమైన సోదర, సోదరీమణులారా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. విజయ దశమి శుభాకాంక్షలు అంటూ కూడా తెలుగులోనే చెప్పారు.
అమరావతి రాజధాని శంకుస్థాపన ఆహ్వానం కోసం ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కెసిఆర్ ఇంటికి వెళ్లి స్వాగతించారని తెలిసిందని, దానికి తాను ఎంతో సంతోషించానని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు ప్రాంతాలైనా రెండు రాష్ట్రాలకు చెందిన వారిలోని తెలుగు ఆత్మ ఒక్కటేనన్నారు.
ఇరురాష్ట్రాలు అదే పంథాలో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో పలువురు చనిపోవడం, పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనను కలచివేసిందన్నారు. ప్రాంతాలు వేరైనా, భాషాపరంగా రెండు రాష్ట్రాల ప్రజలు ఒక్కటేనన్నారు.

అమరావతి రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు తానే స్వయంగా వెళ్లానని చంద్రబాబు చెప్పినపుడు తాను చాలా సంతోషించానన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు విద్వేషాలను పక్కనబెట్టి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ఏఏ హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ తాము అమలు చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు.

ఏపీ నూతన అధ్యాయంలోకి
ఆంధ్రప్రదేశ్ ఓ నూతన అధ్యాయంలోకి ప్రవేశిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. శతాబ్దాల చరిత్రను గుర్తుచేసేలా, అత్యాధునిక వసతులతో నిర్మించబోయే అమరావతి శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని మంచి పద్దతులన్నింటినీ మేళవించి అమరావతి నిర్మాణాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. భారతదేశంలో కొత్త నగరాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కాగా, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications