అంతుచిక్కడం లేదు?: జగన్ ధీమా ఏంటో.. లొంగిపోయినట్టుగా ఎందుకిలా!
విజయవాడ: నంద్యాల ఉపఎన్నిక ఫలితం ఒక విషయంలో స్పష్టతనిచ్చింది. వైసీపీ సామర్థ్యాన్ని అది పట్టివ్వగలిగింది. పార్టీ కన్నా నేతలను చూసే ప్రజలు ఓట్లేశారన్న సంగతి ఆ ఎన్నికల ద్వారా తేలింది.
నిజంగా వైసీపీకి ప్రజాక్షేత్రంలో అంత పట్టు ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినట్లే ఉపఎన్నికలోను ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థే విజయం సాధించాల్సి ఉండేది. కానీ అలా జరగలేదు. అంతకుముందు వైసీపీ టికెట్ మీద గెలిచి.. ఉపఎన్నికలో టీడీపీ తరుపున బరిలో దిగిన భూమా కుటుంబాన్నే ప్రజలు గెలిపించారు. దీన్ని బట్టి వైసీపీ సామర్థ్యం నేతలపై ఆధారపడి ఉన్నదే తప్పితే.. పార్టీ సామర్థ్యం ఆ స్థాయికి ఇంకా పెరగలేదనే వాదన వినిపిస్తోంది.
ఆశ్చర్యం కలిగించేదే:
ఉపఎన్నిక తర్వాత మరోసారి వైసీపీ నేతల ఫిరాయింపు బాటను చూస్తే.. పార్టీపై నమ్మకం లేకనే వారు బయటకు వెళ్తున్నట్లు అర్థమవుతోంది. ఈ పరిణామాలన్ని వైసీపీ బలాబలాలను చర్చకు పెడుతున్నాయి. పార్టీగా అంత బలం లేకున్నా.. జగన్ మాత్రం ఫిరాయింపులకు అడ్డుపడే ప్రయత్నం కూడా చేయకపోతుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.
Recommended Video
అంతుచిక్కడం లేదు:
జగన్ లో ఇంత ధీమా పార్టీకి నష్టం చేసేదా? లాభం చేసేదా? అన్నది వారికే తెలియాలి. ఓవైపు పాదయాత్రకు సిద్దమవుతున్న తరుణంలో.. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటం కచ్చితంగా ప్రభావం చూపించే అంశమే. పైగా వాళ్లు వెళ్లిపోతే కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వవచ్చునని జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో వైసీపీ కొత్తవాళ్లకు టికెట్ ఇచ్చి నెగ్గించుకోగలదా? అన్నది అనుమానమే. జగన్ మాత్రం అంత ధీమాగా ఎందుకున్నారో అంతుచిక్కడం లేదు.
లొంగిపోయినట్టేనా?, వ్యూహాత్మకమేది:
పార్టీని వీడాలనుకున్నవాళ్లను బుజ్జగించినా పెద్దగా ఉపయోగం లేదని జగన్ భావించడం వల్లే వారిని వారించే ప్రయత్నం కూడా జరగట్లేదని తెలుస్తోంది. ఈ ధోరణి ఒకవిధంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ముందు వైసీపీ లొంగిపోయినట్లే అనిపించకమానదు. కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. పార్టీని వీడేవాళ్ల విషయంలో ఎలాంటి వ్యూహాత్మక ధోరణి ఆయన అవలంభించడం లేదని తెలుస్తోంది.
ఆ ధైర్యం ఎవరికీ లేదా?:
జగన్ తీరుతో పార్టీలోని ఇతర నేతలకు కూడా నమ్మకం సడలిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. నంద్యాల ఉపఎన్నిక తర్వాత ఆత్మన్యూనతలో ఉన్న నేతల్లో జగన్ ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తారని భావించినప్పటికీ.. పరిణామాలు అందుకు విరుద్దంగానే ఉన్నట్టున్నాయి. తాజా ఫిరాయింపులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో జగన్ కు నచ్చజెప్పేంత ధైర్యం మరో నేతకు లేకపోవడం కూడా ఈ ఫిరాయింపులకు కారణమనే అర్థం చేసుకోవాలేమో!