ఘోరం: కరోనా సోకిందని దంపతులను ఇంట్లో పెట్టి తాళం వేశారు
అమరావతి: కరోనా కష్టకాలంలో నెల్లూరులో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. అసలే కరోనా వచ్చి అష్టకష్టాలూ పడుతున్న ఓ కుటుంబానికి.. ఇరుగుపొరుగువారు సహాయం చేయాల్సిందిపోయి.. వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. వారింటికి తాళం వేసి బయటికి రాకుండా చేశారు.
Recommended Video

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న భార్యాభర్తలకు 10 రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో వారు హోం ఐసోలేషన్లోనే ఉంటున్నారు. దీంతో వారి బంధువులు అవసరమైన సాయం చేస్తున్నారు. అయితే, సోమవారం రాత్రి మందులు అవసరం రాగా.. ఎవరూ అందుబాటులో లేరు.

తప్పనిసరి పరిస్థితుల్లో భర్త బయటకు వెళ్లి మందులు తీసుకొచ్చాడు. ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు వారి ఇంటికి తాళం వేశారు. కరోనా సోకిన వ్యక్తి బయటకు వచ్చినందువల్లే తాళం వేసినట్లు అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి ఇంటికి వెళ్లి తాళం తొలగించారు. కరోనా బాధితుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అపార్ట్మెంట్ వాసులకు హితవు పలికారు. కాగా, వైరస్ సోకిన నాటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కనీస మానవత్వం లేకుండా తమను ఇంట్లో ఉండగానే తాళం వేశారని బాధితులు వాపోయారు.
కాగా, ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా.. 5963 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నమోదైన 5963 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,68,000కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 27 మంది మృతి చెందారు.
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2569 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,12,510కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 48,053 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,57,15,757 కరోనా నమూనాలను పరీక్షించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, గుంటూరు జిల్లాలో 938 కరోనా కేసులు నమోదు కాగా, అల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లా మినహా 8 జిల్లాల్లో 200కిపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం కేసులు తక్కువగా నమోదవుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications