లడ్డు 11.75లక్షలు, టీ మొక్కు 11,116 కొబ్బరికాయలు
హైదరాబాద్: హైదరాబాదులోని నేరేడ్మెట్లో గణేష్ లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. వెస్ట్ దీనదయాల్ నగర్ వినాయకుడి లడ్డూనూ రూ.11.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. ప్రాముఖ్యత కలిగిన బాలాపూర్ లడ్డూ ధర కంటే రెండు లక్షలకు పైగా అధిక రేటు పలికింది.
బాలాపూర్ లడ్డూ రూ.9.50 లక్షలు పలికిన విషయం తెలిసిందే. సింగిరెడ్డి జయేందర్ రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గుంటూరులోని మిర్చి యార్డు గణేష్ లడ్డూను రూ.2.75 లక్షలకు యలమంచిలి పుల్లారావు దక్కించుకున్నారు.
ఖైరతాబాద్ గణపతికి 11,116 కొబ్బరికాయలు
తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే ఖైరతాబాద్ మహాగణపతి చెంద 11,116 కొబ్బరికాయలు కొడతామని గత ఏడాది మొక్కుకున్న తెలంగాణ ఖైరతాబాద్ జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ దానిని నెరవేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో వినాయక చవితి తొలి రోజున కొబ్బరికాయను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొట్టించారు. ఖైరతాబాద్ గణేషుడు పైన సాయంత్రం ఐదు గంటలకు పూలవర్షం కురిపిస్తారు
ఆ రోజు నుండి ప్రతిరోజు కొన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు. చివరి రోజైన సోమవారం ఒకేసారి 600 కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్రం ఏర్పడితే 11,116 కొబ్బరికాయలు కొట్టాలన్న తన మొక్కును తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందని చంద్రశేఖర్ అన్నారు.