మాకు చంద్రబాబు ఉన్నాడు, జగన్పై పల్లె నిప్పులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదుకు ఐటీ రంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో బాగా గుర్తింపు వచ్చిందంటే అందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని, ఇప్పుడు ఏపీకి వైభవం తీసుకు రావడం ఆయన వల్లే సాధ్యమవుతుందని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సోమవారం అన్నారు.
ఐటీ రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఓ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. మంగళవారం నుండి అయిదు రోజుల పాటు ఐటీలో పెట్టుబడుల సాధన కోసం మంత్రి పల్లె, ఐటీ కార్యదర్శి జపాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
అలాగే ఐటీ ప్రతినిధులతోను మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఐటీ రంగం అభఇవృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. మరో సందర్భంలో ఆయన జగన్ పైన మండిపడ్డారు. జగన్ రైతు భరోసా యాత్ర బూటకమని, రైతులను మభ్యపెట్టేందుకే జగన్ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏ రైతు అడిగాడని జగన్ రైతు భరోసా యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై మండి పడ్డ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సాగడం లేదని విమర్శించారు. పంచాయితీరాజ్, ఎక్సైజ్శాఖల్లో మంత్రులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
బైక్ రేసింగ్, కారు రేసింగ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అధికార పార్టీ నేతలు ఏం చేసినా పట్టించుకోని పోలీసులు విపక్షపార్టీల కార్యకర్తలపై లాఠీచార్జ్ చేస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పోస్టింగులు ఇప్పిస్తున్నారన్నారు.