ఏపి కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో గుంటూరు-విజయవాడల మధ్యనే కొత్త రాజధానిని నిర్మించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుకు కూడా ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిని ముందే ప్రకటిస్తే పలువురు వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆ ప్రదేశంలోని భూములను భారీగా కొనుగోలు చేస్తారని, అది ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడ-గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ నుంచే తన అధికారిక కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చెప్పడం గమనార్హం.
అయితే ఒంగోలు-ఏలూరు మధ్యలో కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున తమ పార్టీ నేతల కోరిక మేరకు విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్యనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అనువుగా ఉండటంతో రాజధానిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.