భారీ వంతెనలు: అమరావతి కేంద్రంగా ఏపీ రాజధాని?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ - గుంటూరుల మధ్య నిర్మించనున్నారనే వార్తలు ఇటీవల జోరందుకున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తోంది. అమరావతి కేంద్రంగా ఏపీ కొత్త రాజధానిని నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
కృష్ణా నదీతీరాన ఉన్న అమరావతిని కేంద్రంగా చేసుకొని తాడిగొండ, అచ్చంపెట, మంగళగిరిల పరిధుల్లో రాజధానిని నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట. అదే సమయంలో కృష్ణా నదికి అటువైపు కృష్ణా జిల్లాలో ఉన్న ప్రాంతాలను... కొత్త రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాన్ని కలుపుతూ పలు భారీ వంతెనులు నిర్మించాలన్న ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. వంతెనలు నిర్మిస్తే విజయవాడ నుండి కొత్త రాజధానికి దూరం తగ్గుతుంది.

నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఒక పెద్ద రాజధాని రూపొందుతుందని అంచనా వేస్తున్నారట. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అమరావతి వైపు చూస్తున్నారని సమాచారం.
అమరావతి మండలంలో పదివేలకు పైగా ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. తాడిగొండ మండలంలో దాదాపు ఏడువేలు, అచ్చంపేట మండలంలో పదహారు వేలకు పైగా ఎకరాల భూమి ఉంది. దీనిపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు రికార్డులు సిద్ధం చేశారట. అదే సమయంలో కొత్త రాజధానిని జాతీయ రహదారులకు అనుసంధానించేలా రోడ్లు నిర్మిస్తారు.












Click it and Unblock the Notifications