ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ ముహుర్తం ఖరారు-మళ్లీ ప్రైవేటుకు టెండర్లు ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన మద్యం విధానానికి త్వరలో మంగళం పాడేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. దీని స్ధానంలో కొత్తగా మరో ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఇతర రాష్టాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాల్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఒక్కో టీమ్ లో ముగ్గురు అధికారుల చొప్పున ఉన్నారు. వీరు పది రోజుల్లో ఆయా రాష్ట్రాల్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపుదిద్దుకోనుంది.
ఏపీలో ప్రస్తుతం గత వైసీపీ మద్యం పాలసీయే అమలవుతోంది. దీని ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలున్నాయి. గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రైవేటు కాంట్రాక్టర్లు వేలం ద్వారా మద్యం షాపుల్ని చేజిక్కించుకునేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విధానం రద్దు చేసి తామే మద్యం వ్యాపారం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ ఎత్తున సిబ్బందిని కూడా నియమించుకుంది. ఇప్పుడు వీరిని తొలగించి ప్రభుత్వం తిరిగి ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చే అవకాశముంది.

గతంలో దశలవారీ మద్య నిషేదం అమలు చేస్తామని అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్.. ఆ తర్వాత అరకొరగా షాపులు తగ్గించి తిరిగి వాటిని పెంచేసింది. నాసిరకం బ్రాండ్లను తెచ్చి అసలు బ్రాండ్లను రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకుంది. మద్యం పంపిణీ, సరఫరాపై తీవ్ర ఆంక్షలు విధించింది. దీని వల్ల దొడ్డిదారిన ప్రభుత్వ పెద్దలకు మాత్రమే లబ్ది చేకూరింది. దీంతో ఇప్పుడు తిరిగి కూటమి సర్కార్ వేలం పాట నిర్వహించి మద్యం షాపుల్ని ప్రైవేటుకు కట్టబెట్టనుంది. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసేందుకు నాలుగు టీమ్స్ ఏర్పాటు చేసింది. ఈ టీమ్స్ నివేదిక ఆధారంగా అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమలు చేయనుంది.












Click it and Unblock the Notifications