భలే చౌక ప్రయాణం: సిటీల మధ్య విమాన టిక్కెట్ ధర రూ.2500!
ఢిల్లీ: మధ్య తరగతి ప్రజలు కూడా ఎంచక్కా విమానాల్లో విహరించవచ్చు. కొత్త విమానయాన పాలసీ ముసాయిదాని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఢిల్లీలో విడుదల చేసింది. దీని ముఖ్య లక్ష్యం విమాన ఆపరేటర్ల ఖర్చులు తగ్గించడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ కనెక్టివిటీ విస్తరించడం.
మధ్య తరగతి ప్రజలకు విమానయానాన్ని దగ్గర చేసే లక్ష్యంతో ఈ సరికొత్త ముసాయిదాను విమానయాన శాఖ ఉదయం విడుదల చేసింది. చిన్న విమానాశ్రయాల సంఖ్య పెంచడం, నిర్వహణా వ్యయాలను తగ్గించడం ప్రధానంగా తయారైన ముసాయిదాపై పరిశ్రమ వర్గాలు, ప్రజల స్పందనను కేంద్రం కోరింది.
త్వరలోనే దీనికి తుది రూపు ఇవ్వనుంది. దేశవాళీ విమానయాన సంస్థల్లో ఎఫ్డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)ని 50 శాతం వరకూ అనుమతించాలని కూడా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయి. విమానయాన సంస్థలపై ఒత్తిడిని తగ్గించేందుకు పన్ను రాయితీలు, విమాన మరమ్మతులపై సేవా పన్ను రాయితీలను ప్రతిపాదించారు.
సమయానుకూలంగా ఈ రంగాన్ని సమీక్షిస్తూ... ఎప్పటికప్పుడు నూతన నిర్ణయాలు తీసుకోవాలని, ఒక గంట ప్రయాణ సమయమున్న నగరాలు, పట్టణాల మధ్య మరింతగా సర్వీసులను పెంచాలని తెలిపారు.
నగరాల మధ్య గరిష్ఠంగా టికెట్ ధర రూ.2,500కు మించకుండా చూడాలని, తప్పనిసరి పరిస్థితుల్లో ధర పెరిగితే, దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని ముసాయిదాలో ఉంది. దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో కమర్షియల్ విమానాల్లో ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో 2 శాతం రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది.
ఈ నిర్ణయాలు అమలైతే తక్కువ దూరాలు ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉంటుందని ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు నగరాల మధ్య ఒక్కో ప్రయాణికుడి పైన టిక్కెట్ ధరను రూ.2,500కు పరిమితం చేయడం, ఒకవేళ ఎక్కువైతే మిగతా మొత్తాన్ని ఎయిర్ లైన్ సంస్థలకు కేంద్రం చెల్లించడం గమనార్హం.