కరోనా ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త పని వేళలు ఇవే.. ఆ సేవలకు మాత్రం బ్రేక్...
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేఫథ్యంలో రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల సమితి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ను దాదాపుగా నిరుత్సాహపరిచేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి. వీటిలోబ్యాంకుల పని వేళల తగ్గింపుతో పాటు పలు కీలక సర్వీసులను కూడా నిలిపివేయనున్నారు. ఇవన్నీ రేపటి నంచి రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకూ వర్తింపచేస్తామని బ్యాంకర్ల రాష్ట్ర సమితి ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్, పనివేళల్లో మార్పు..
ఏపీలో అంతకంతకూ తీవ్రమవుతున్న కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి అన్ని బ్యాంకులకు మార్గదర్శాలు పంపింది. ఇందులో ప్రధానమైనది బ్యాంకుల పనివేళల తగ్గింపు. ఇప్పటివరకూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పలు బ్యాంకులు తమ సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు వాటిని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పరిమితం చేశారు. కస్టమర్లను అవసరమైతే తప్ప ఈ వేళల్లోనూ బ్యాంకులకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.

బ్యాంకుల్లో ఈ సేవలకు విరామం..
కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కస్టమర్లు ఎక్కువగా వాడుతున్న రెండు సేవలను తాత్కాలికంగా నిలిపేయాలని రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. వీటిలో కొత్తగా ఖాతాలు తెరవడం, రెండవది రుణాల మంజూరు. ఈ రెండు సేవలను ఈ నెల 31 వరకూ నిలిపివేయనున్నారు.
వీటితో పాటు ప్రస్తుతం బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందిలో సగం మందిని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. మిగతా వారు వర్క్ ప్రమ్ హోమ్ లేదా సెలవులో ఉంటారు.

ఏటీఎంల్లో నగదు యథాతథం..
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకింగ్ సేవల్లో పలు మార్పులు చేసిన బ్యాంకర్ల కమిటీ.. ఏటీఎం సేవలు మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ఏటీఎంలలో పూర్తిగా నగదు అందుబాటులో ఉంచాలని బ్యాంకు అధికారులను ఆదేశించింది. అయితే ఏటీఎం కేంద్రాల వద్దకు గుంపులుగా వెళ్లొద్దని బ్యాంకర్ల సమితి ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 31న పరిస్ధితిని మరోసారి సమీక్షించాక తిరిగి వీటిలో కొన్ని మార్పులు చేయనుంది.












Click it and Unblock the Notifications