జగన్ అక్రమాస్తుల్లో ఉన్న ఐఏయస్ పై మరో కేసు: హైకోర్టు ఆదేశాల మేరకు: చిక్కుల్లో ఆ ముగ్గురు..!
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి పైన గతంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏయస్ అధికారుల్లో కొందరికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. జగన్ కేసుల్లో మొత్తం ఏడుగురు ఐఏయస్ అధికారులు సీబీఐ అభియోగాలు ఎదుర్కొన్నారు. వారిలో కొందరు తమకు ప్రభుత్వం నుండి న్యాయ సాయం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ ను కోరారు. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ విధంగా ప్రభుత్వం నుండి ఆర్దిక సాయం పొందేందుకు జగన్ కేసుల్లో నాడు విచారణ ఎదుర్కొన్న ఒక సీనియర్ అధికారి సమర్పించిన బిల్లుల పైన రమణ అనే న్యాయవాది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అవి నకిలీ బిల్లులనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిల్లుల సమర్పించిన అధికారితో పాటుగా బిల్లులు పాస్ చేసిన అధికారుల మీద కేసులు నమోదయ్యాయి.
అధికారుల మెడకు మరో కేసు
జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొన్న మాజీ ఐఏఎస్ అధికారి సీవీఎస్కే శర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇరిగేషన్ కార్యదర్శిగా ఆయన సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. తమ పైన నమోదు అయిన కేసులను ఎదుర్కోవటానికి ప్రభుత్వం నుండి సాయం అందించాలని కోరారు. దానికి ప్రభుత్వం అంగీకరించింది. 2012లో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. సీవీఎస్కే శర్మ ప్రభుత్వానికి తనకు లీగల్ గా అయిన ఖర్చు రీయంబర్స్ చేయాలంటూ బిల్లులు సమర్పించారు. నాటి ప్రభుత్వం బిల్లుల మొత్తంగా రూ.7,56,460లను లీగల్ ఛార్జీలను పొందారు. అయితే ఆయన సమర్పించిన బిల్లులు నకిలీ అంటూ పీవీ రమణ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు. అయితే, అందులో శర్మతో పాటుగా మరో ఇద్దరి అధికారుల ప్రమేయం ఉందని ఫిర్యాదు చేసారు.

మరో ఇద్దరు అధికారుల మీద..
సీవీఎస్కే శర్మ సమర్పించిన బిల్లులను నాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న పీకే మహంతి వెంటనే ఆమోదిస్తూ బిల్లుల మంజూరుకు ఆదేశించారు. శర్మ పెట్టిన బిల్స్ను సరిగా పరిశీలించకుండానే నాటి సీఎస్ పీకే మహంతి సంబంధిత బిల్లుపై సంతకం చేశారని.. అప్పటి రెవిన్యూ ముఖ్య కార్యదర్శి పీవి రమేష్ నిధులు విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో..కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. అప్పుడు పని చేసిన శర్మ..పికే మహంతి ఇద్దరూ పదవీ విరమణ చేసారు. ఇక, రెవిన్యూ కార్యదర్శిగా నిధులు విడుదల చేసిన పీవీ రమేష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఆయన పదవీ విరమణ చేసినా ప్రత్యేక హోదా కల్పించి ఆయన సేవలను జగన్ వినియోగించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ కేసు గురించి అధికారులు ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications