వైసీపీలో కొత్తగా కోర్ కమిటీ - ప్లీనరీతో కొత్త మార్పులు : ఎమ్మెల్యే టు సీఎం..!!
తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందు కోసం పార్టీలోనూ మార్పుల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి. పార్టీ ప్లనరీ వేదికగా.. కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే జిల్లా - ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థ కొనసాగుతుండగా.. ఇక, నేరుగా సచివాలయం టు సీఎం వరకు ఎవరైనా నేరుగా సంప్రదించే వ్యవస్థను తీసుకొచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా.. కొత్తగా కోర్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పార్టీలో ఎంపిక చేసిన నేతలు..ప్రాంతాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.
పార్టీలో రెండు కీలక కమిటీలు
ఈ కమిటీ పార్టీ పరంగా కీలక నిర్ణయాల్లో ప్రధాన భూమిక పోషిస్తుంది. దాదాపు 18 మందితో ఈ కమిటీ ఏర్పాటుకు ప్రాధమిక కసరత్తు చేసినట్లు సమాచారం. దీంతో పాటుగా సీఎంకు సలహాలు.. పార్టీలో నిర్ణయాల పైన చర్చించేందుకు వీలుగా సీనియర్లు - ముఖ్య నేతలతో కలిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సైతం ఏర్పాటు కానుంది.
ఈ కమిటీ పార్టీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు.. అమలు చేయాల్సిన కార్యాచరణ వంటి వాటి పైన పార్టీలో కింది స్థాయి నుంచి సమన్వయ కర్తల వరకు అందరితో కో ఆర్డినేట్ చేసుకుంటూ వారి నుంచి వచ్చి ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముఖ్యమంత్రికి నివేదికలు ఇవ్వనుంది. ఇక, ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో సీఎం స్థాయితో అమలుకు తీసుకోవాల్సిన నిర్ణయాల పైన నేరుగా సంప్రదించే అవకాశం కల్పిస్తున్నారు.
ఎమ్మెల్యేలు నేరుగా సీఎంఓతో అనుసంధానం
సీఎంఓ గ్రూపుతో ఎమ్మెల్యేలను అనుసంధానం చేస్తూ కేవలం వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినా.. దీని పైన జిల్లా స్థాయిలో సమాచారం సేకరించి.. నిర్ణయం తీసుకొనే విధంగా కార్యాచరణ సిద్దం చేసారు. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి నిర్వహిస్తున్న ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
జూలై 8,9 తేదీల్లో నిర్వహించే ప్లీనరీకి సంబంధించి కమిటీల నియామకం ప్రారంభించారు. ప్లీనరీ నిర్వహణ.. తీర్మానాలు.. సమన్వయం..ప్రసంగాలు..వసతి సదుపాయాలు వంటి వాటి కోసం పార్టీ నేతలతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీ ప్రారంభ, ముగింపు సమావేశాల్లో అధినేత ప్రసంగం ఉండనుంది. ముగింపు ప్రసంగంలో వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ శంఖారావం పూరించనున్నారు.
ప్లీనరీ వేదికగా కీలక నిర్ణయాల దిశగా
కీలక నిర్ణయాలు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి ప్లీనరీలో దాదాపు 15 వరకూ తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం - మహిళా ప్రాధాన్యత - సామాజిక న్యాయం - ఆర్దిక అంశాలు - ప్రభుత్వ విజయాలు - పాలనా పరంగా నిర్ణయాలు - జగనన్న కాలనీలు వంటి వాటి పైన తీర్మానాలు చేయనున్నారు. ఇక , రెండో రోజున వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యం గా.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసేలా రాజకీయ తీర్మానం చేయనున్నారు. దీంతో.. ఈ సారి పార్టీ ప్లీనరీ రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ వైసీపీకి కీలకంగా మారనుంది.