ఢిల్లీ:నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం...ప్రారంభంలోనే కుండబద్దలు కొట్టిన చంద్రబాబు
న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 6 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది.
ఇదిలావుంటే నీతి అయోగ్ సమావేశం ప్రారంభంలోనే ఎపి సిఎం చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై నిర్మొహమాటంగా తాను చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెల్చిచెప్పారు. సమావేశం ప్రారంభమయ్యాక చంద్రబాబు 13 పేజీల ప్రసంగాన్ని 20 నిముషాలపాటు ప్రస్తావించారు. నీతిఅయోగ్ అంశాలపై ప్రస్తావనకు ముందే ఏపీ విభజన హామీల అమలులో కేంద్రం తీరును ఎండగట్టారు.
నీతి అయోగ్...సమావేశం ప్రారంభం
డిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఆయుష్మాన్ భారత్, పౌష్టికాహారం, మిషన్ ఇంద్రదనస్సు, జిల్లాల అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపు, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలపై చర్చ జరగనుంది. చర్చ అనంతరం మధ్యాహ్నం 3.30కు సీఎంలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుంది. మరోవైపు దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరయ్యారు.
కుండబద్దలు కొట్టిన చంద్రబాబు
ప్రధాని మోదీ ఎదుట ఏపీ సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు. నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభంలోనే చంద్రబాబు తాను చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజనను కోరుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి ఆయన మాట్లాడారు. విభజనతో ఏపీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. విభజనతో ఆర్థికంగా ఏపీ నష్టపోయిందని, రెవెన్యూలోటును భర్తీ చేయాల్సిందేనని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అదనపు టైమ్...తీసుకున్న సిఎం
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగానికి ముఖ్యమంత్రులకు 7 నిముషాలే సమయం కేటాయించినప్పటికీ...ఏపీ ప్రత్యేక రాష్ట్రమని, విభజన జరిగిన తర్వాత ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని, కాబట్టి తన స్పీచ్ను కూడా ప్రత్యేకంగా చూడాలంటూ సుమారు 20 నిమిషాల పాటు సిఎం చంద్రబాబు ప్రసంగించినట్లు తెలిసింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలన్నింటిని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈ అంశాలను బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని, తర్వాత ఫైనాన్స్ కమిషన్ సాకుగా చూపించి హోదా ఇవ్వకపోవడం అన్యాయమని చంద్రబాబు తప్పుబట్టారు.
ఇవన్నీ...ఇవ్వాలి...
రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని మరింత పెంచాలని సిఎం చంద్రబాబు కోరారు. రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నారు. విద్యాసంస్థలకు ఇవ్వాల్సిన నిధులు త్వరగా విడుదల చేస్తే వాటి నిర్మాణాలు పూర్తి అవుతాయని చంద్రబాబు స్పష్టంచేశారు. రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, సీట్ల పెంపు విషయాన్ని కూడా ఈ సందర్బంగా చంద్రబాబు ప్రస్తావించారు. స్టీల్ ఫాంట్, వైజాగ్-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రోరైల్, పోర్టు వీటన్నిటితోపాటు 1971ని ఆధారంగా చేసుకుని నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి హోదా ఎందుకు అవసరమన్నది కూడా చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.
ముగించమన్నా సరే...సిఎం కొనసాగింపు
నిధుల పంపిణీలో కేంద్రం వివక్ష చూపుతోందని, పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశమంతటా వ్యాపించిందని, చిరు వ్యాపారులు, రైతులు ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీలైన హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమయాభావంవల్ల ప్రసంగాన్ని ముగించవలసిందని చంద్రబాబును కోరారు. అయినా సిఎం లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. మొత్తం 35 పాయింట్లపై చంద్రబాబు మాట్లాడారని సమాచారం. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా చంద్రబాబు తన ప్రసంగంలో వివరించారు.