లోకేశ్ రాజీనామా చేయాలి: ఓటమికి బాధ్యతగా..ఆ నేతల డిమాండ్: ఏపీ టీడీపీ చీఫ్గా రామ్మోహన్..!
Recommended Video
టీడీపీలో కొత్త డిమాండ్: ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులకు కొత్త వాదన. పార్టీ వీడి బీజేపీలో చేరాలని వేగంగా పావులు కదుపుతున్న నేతలు టీడీపీలో కలకలం రేపుతున్నారు. ఏపీలో ఇంత ఘోరంగా పార్టీ ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. ఇందు కోసం పార్టీ వీడుతూ కొత్త డిమాండ్ తెర పైకి తెచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో..ప్రభుత్వంలో క్రియా శీలకంగా వ్యవహరించిన లోకేశ్ రాజీనామా చేయాలని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాల్లో భాగంగానే ఈ డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

లోకేశ్ రాజీనామా చేయాలి..
టీడీపీలో కొందరు ముఖ్య నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైంది. ఇదే సమయంలో వారు టీడీపీని వీడుతూ పార్టీలో కొత్త డిమాండ్ తేవాలని నిర్ణయించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో..ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన లోకేశ్ పార్టీ ఓటమికి బాధ్యత తీసుకోవాలనే డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు సైతం తనయుడు లోకేశ్కు అవసరానికి మించి ప్రాధాన్యత ఇచ్చారని..అది నష్టం చేసిందని వారి వాదిస్తున్నారు. భూ కేటాయింపులు..కొంత మందికే ప్రాధాన్యతలు..ఎమ్మెల్యే టిక్కెట్ల పైన హామీలు.. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకపోవటం.. కాంట్రాక్టులు.. ఇటువంటి అంశాల్లో చంద్రబాబును పూర్తిగా లోకేశ్ ప్రభావితం చేసారని..అవే ఓటమికి ప్రధాన కారణాలయ్యాయనేది వారి ఆరోపణ. బీజేపీ వ్యూహంలో భాగంగానే ఈ డిమాండ్ తెర మీదకు తెస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

ప్రధాన కార్యదర్శిగా కొనసాగద్దు..
ఇదే సమయంలో బీజేపీ లో చేరే ముందుగా టీడీపీలో అయోమయం సృష్టించటంలో భాగంగా ఈ డిమాండ్ తెర పైకి తెస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని ఆ నేతలు డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. భావి ముఖ్యమంత్రిగా ప్రచారం చేసిన కొందరు టీడీపీ నేతలు ఇక లోకేశ్ గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేయటమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం బీజేపీలోకి వెళ్తారనే ప్రచారంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులతో సైతం లొకేశ్ తో కోల్డ్ వార్ నడుస్తోంది. గతంలో తమకు రాజ్యసభ రెన్యువల్ సమయంలో అడ్డపడ్డారనే కారణంతో ఒకరు.. తనకు వ్యతిరేకంగా అనుకూల మీడియాలో కధనాలు వచ్చేలా చేసారని మరొకరు నాటి నుండి లోకేశ్ మీద అసంతృప్తితో ఉన్నా..పార్టీ అధికారంలో ఉండటం..చంద్రబాబుతో ఉన్న మైత్రి కారణంగా బయట పడలేదు. ఇప్పుడు అటువంటి వారు సైతం ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు..
రాష్ట్ర విభజన తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక కావటంతో ఏపీ-తెలంగాణకు రెండు శాఖలకు ఇద్దరు అధ్యక్షులను నియమించారు. ఏపీ అధ్యక్షుడిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత కళా వెంకటరావును
నియమించారు. అయితే, ఆయన నామ్ కే వాస్తే అధ్యక్షుడిగా మిగిలిపోయారు. ఆయనకు మంత్రి పదవి వచ్చిన తరువాత కేవలం లేఖలు రాయటానికి మాత్రమే పరిమితం అయ్యారు. తాజా ఎన్నికల్లో పార్టీతో పాటుగా ఆయన సైతం ఓడిపోయారు. దీంతో..ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉండటంతో అదే జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన యువ నేతకు బాధ్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా..శ్రీకాకుళం నుండి రెండో సారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడిగా నిమయించాలని నిర్ణయించారు. రామ్మోహన్ అయితే భవిష్యత్ లో లోకేశ్కు సైతం ప్రయోజనకరంగా ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications