క్రియాశీలక రాజకీయాల్లోకి.. వైఎస్ భారతి?
వైఎస్ కుటుంబం నుంచి మరో నాయకురాలు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ నేత ఎవరంటే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. ఆమె వైసీపీలో కీలక నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్: వైఎస్ కుటుంబం నుంచి మరో నాయకురాలు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ నేత ఎవరంటే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. ఆమె వైసీపీలో కీలక నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోగా ఆ పార్టీ అధిష్ఠానం తరుపున వైఎస్ భారతి రంగంలోకి దిగడం తెలిసిందే. భారతి తనకు ఫోన్ చేసి మాట్లాడారని, వైసీపీలోనే కొనసాగాల్సిందిగా సూచించారని ఎమ్మెల్యే ఈశ్వరి కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి భారతి కూడా క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో చెరగని ముద్ర...
రాజకీయాల్లో వైఎస్ కుటుంబం చెరగని ముద్ర వేసింది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఆ కుటుంబం మంచి గుర్తింపును తెచ్చుకుంది. కడప జిల్లాలో తిరుగులేని విజయాలను సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు ఆయన ఓటమి ఎరుగలేదు. వైఎస్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కడప పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ కుటుంబమే కైవసం చేసుకుంటోంది. రాజశేఖర్రెడ్డి మొదలు ఇప్పటి కడప ఎంపీ అవినాష్రెడ్డి వరకు అంతా ఆ కుటుంబానికి చెందిన వారే అత్యధిక మోజార్టీతో విజయం సాధిస్తూ వస్తున్నారు.
వైఎస్ మరణానంతరం...
వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆయన కుటుంబంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆయన వరణానంతరం ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర్రెడ్డి మృతి తర్వాత పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ నుంచి వేరు కుంపటి పెట్టిన జగన్ వైసీపీని స్థాపించారు. అప్పటి నుంచి విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు.
విజయాలతోపాటు అపజయాలూ...
వైఎస్ కుటుంబం విజయాలతో పాటు అపజయాలనూ చవి చూసింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఓడిపోయారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి కూడా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓటమిపాలయ్యారు.
రాజకీయాల్లోకి జగన్ సతీమణి?
వైఎస్ కుటుంబం నుంచి మరో నాయకురాలు రాజకీయాల్లోకి రాబోతున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆ నేత ఎవరంటే... పారిశ్రామిక రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. ఆమె వైసీపీలో కీలక నాయకురాలిగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో ఆ పార్టీ నాయకులతోపాటు వైఎస్ భారతి కూడా రంగంలోకి దిగారు. ఈశ్వరిని వైసీపీలోనే నిలబెట్టేందుకు ఆమె చివరి వరకూ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైఎస్ భారతి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.