అమరావతికి కొత్త రైలుమార్గం.. రూ.2 వేల కోట్ల ఆ ప్రాజెక్టుపై సూపర్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటినుండి రాజధాని అమరావతి అభివృద్ధికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. అటు దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏపీలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం రాజధాని అమరావతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తోంది.
రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచటానికి కొత్త రైల్వే లైన్
ఎన్డీఏ సర్కార్ ఈ ప్రయత్నంలో భాగంగా రైల్వే కనెక్టివిటీని పెంచడానికి కీలక అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి రైల్వే కనెక్టివిటీని పెంచడానికి నిర్ణయించిన క్రమంలో దక్షిణ మధ్య రైల్వే గుంటూరు పరిసర ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి పేరేచర్ల మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి భారీగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

త్వరలో డీపీఆర్ రైల్వే బోర్డుకు
పేరేచర్ల మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రెండువేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ రూట్ కు సంబంధించి సర్వే తుది దశలో ఉంది. 2000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో త్వరలో డీపీఆర్ తయారుచేసి అధికారులు రైల్వే బోర్డు కు ఆమోదానికి పంపనున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా రైళ్లపై ఉన్న ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంది.
పేరేచర్ల నుండి మంగళగిరి వరకు ప్రత్యేక రైలు మార్గం
రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంతోపాటు సరుకు రవాణా కోసం కూడా ప్రత్యేకమైన ఫ్రైట్ కారిడార్ ను కూడా ప్రతిపాదించడం జరిగింది.ఈ రైల్వే లైన్ సర్వే పనులు పూర్తయితే, రైల్వే బోర్డు ఈ పనులకు అనుమతి ఇస్తే పేరేచర్ల నుంచి పొన్నెకల్లు మీదుగా మంగళగిరి వరకు ప్రత్యేక రైలు మార్గం ఏర్పడుతుంది. నరసరావుపేట గుంతకల్లు మార్గం ద్వారా గుంటూరు వచ్చే సరుకు రైళ్లకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది.
రాజధాని అమరావతికి బలమైన కనెక్టివిటీ
అంతేకాకుండా విజయవాడ నుంచి వచ్చే రైలు మంగళగిరి మీదుగా పేరేచర్ల కు నేరుగా చేరుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా నల్లపాడు బీబీనగర్ మార్గం వద్ద ఆర్ఓఆర్ వంతెన నిర్మాణం కూడా ప్రతిపాదించబడుతుంది. ఈ మొత్తం ప్రణాళిక అమలయితే పేరేచర్ల గుంటూరు మంగళగిరి మధ్య ట్రాఫిక్ లోడ్ తగ్గుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల రాజధాని అమరావతికి మరింత బలమైన కనెక్టివిటీ పెరుగుతుందని, ఇది అమరావతికి ప్రయాణించే వారికి ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications