AP 40G : ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ ...
ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్ధానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఈ లోగా వచ్చే అభ్యంతరాలను పరిశీలించి నోటిఫికేషన్ లో తగు మార్పులు చేసి అమలు చేయబోతున్నారు.
తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో వన్ స్టేట్-వన్ సిరీస్ ను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో అప్పటివరకూ జిల్లాల వారీగా ఉన్న పలు సిరీస్ లు రద్దయ్యాయి. వాటి స్ధానంలో కొత్తగా ఏపీ 39 సిరీస్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీంత ఇప్పుడు శ్రీకాకుళంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, తిరుపతిలో చేసుకున్నా అదే సిరీస్ వర్తిస్తోంది. ప్రభుత్వ వాహనాలకు సైతం ఇదే సిరీస్ అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ వాహనాలు ప్రత్యేకంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications