సర్వే: టిడిపికి 13-19, జగన్కు 9-15, టిలో కాంగ్రెస్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోనుందట. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రాఫ్ క్రమంగా దిగజారుతోందట. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, సీమాంధ్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాజకీయ పార్టీల గ్రాఫ్ పెరుగుతోంది.. దిగజారుతోంది. సిఎన్ఎన్-ఐబిఎన్-సిఎన్డిఎస్-లోక్నీతి సర్వే ప్రకారం.. ఇరు ప్రాంతాల్లో టిడిపి 13-19 స్థానాలను కైవసం చేసుకోనుంది.
సర్వే ప్రకారం... వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 9-15 సీట్లు రానున్నాయి. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలకు నాలుగు నుండి8 సీట్లు వస్తాయి. ఓట్ల పరంగా తెలంగాణలో కాంగ్రెసు, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీలది పైచేయిగా ఉండనుంది. రాష్ట్రంలో టిడిపికి 29 శాతం ఓట్లు లభించనున్నాయి. ఇప్పటి వరకు చతికిలపడిన కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పుంజుకుంది. తెరాసతో నువ్వా-నేనా అనే స్థాయిలో ఉంది.

సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య హోరాహోరీ ఉండనుంది. ఇరు ప్రాంతాల్లో 42 లోకసభ స్థానాలు ఉండగా.. సీమాంధ్రలో 25, తెలంగాణలో 17 ఉన్నాయి. ఇందులో టిడిపి 13-19 స్థానాలు, జగన్ పార్టీ 9-15, కాంగ్రెసు, తెరాసలు 4-8 మధ్య దక్కే అవకాశముంది. ఓట్ల విషయానికి వస్తే ఇరు ప్రాంతాల్లో కలిపి టిడిపి 29 శాతంతో అగ్రస్థానంలో ఉంది. విడివిడిగా చూస్తే తెలంగాణలో కాంగ్రెసు, సీమాంధ్రలో టిడిపి ముందంజలో ఉంది.
సీమాంధ్రలో కోస్తాంధ్రలో టిడిపిది పై చేయి ఉండనుంది. రాయలసీమలో మాత్రం జగన్ పార్టీ జోరు మీద ఉంది. అక్కడ జగన్ పార్టీకి 41 శాతం, టిడిపికి 31 శాతం ఓట్లు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత తెరాసదేనని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు. 21 శాతం మంది ఢిల్లీలోని కాంగ్రెసు అధినాయకత్వం నిర్ణయం కారణంగా సాధ్యమైందని చెప్పారు. తెరాసను విలీనం చేయక పోవడాన్ని ఎక్కువ మంది సమర్థించారు. సీమాంధ్రలో 65 శాతం మంది కాంగ్రెసు పార్టీ పైన భగ్గుమంటున్నారు.












Click it and Unblock the Notifications