జగన్కు షా మెసేజ్ తర్వాత మరో ట్విస్ట్: కన్నాతో టీడీపీ చర్చలు, రంగంలోకి మంత్రులు!
Recommended Video
అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంశంలో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన.. తనకు పదవి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తేదీని కూడా ఖరారు చేశారు.
వీర్రాజుకు షాక్! ఏపీ బీజేపీ చీఫ్ అంశంలో కొత్త ట్విస్ట్: తెరపైకి మాజీ ఉన్నతాధికారి
అయితే, అనారోగ్యం కారణంతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన వైసీపీలో చేరాలనుకున్న కన్నా.... వైసీపీ అధినేత జగన్కు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మెసేజ్ కారణంగా ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు కన్నా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
కాపు సామాజిక వర్గంలో బలమైన నేత
కన్నా లక్ష్మీనారాయణకు కాపు సమాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ఆయన వైసీపీలో చేరకుండా టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
కన్నాతో టీడీపీ మంతనాలు
ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణతో ఇద్దరు మంత్రులు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంకు చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన మరో మంత్రి, మరికొందు టీడీపీ ఎమ్మెల్యేలు కన్నాతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.
టీడీపీలోనే చేరాలనుకున్నారట కానీ
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రత్యేక హోదా అంశం, ఏపీలో బీజేపీకి అంత పట్టు లేకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ తొలుత టీడీపీలో చేరాలని భావించారట. కానీ ఆయనకు సీటు ఇచ్చే విషయంలో పార్టీ అధిష్టానం నుంచి సరైన స్పష్టత రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ వైపు చూశారని అంటున్నారు.
అమిత్ షా మెసేజ్, చేరిక బ్రేక్
అయితే, వైయస్ జగన్కు అమిత్ షా మెసేజ్ పెట్టడంతో వైసీపీలో కన్నా చేరికకు బ్రేక్ పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అక్కడ బ్రేక్ పడటంతో టీడీపీ నేతలు ఆయనతో మరోసారి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
బీజేపీ నాటకంలో భాగమని
టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ, వైసీపీలు కుట్రకు పాల్పడుతున్నాయని వర్ల రామయ్య ఆరోపించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వైసీపీ నేతలు ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కనుసన్నల్లో మెలుగుతున్నారన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారని, బీజేపీ నుంచి ఎవరినీ చేర్చుకోవద్దంటూ వైసీపీకి అమిత్ షా నుంచి ఆదేశాలు వచ్చాయని, కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం బీజేపీ నాటకంలో అంతర్భాగమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
జగన్ను చేరమని కేంద్రమంత్రి
మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో చేరమని వైయస్ జగన్ను స్వయానా కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే ఆహ్వానించడం బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి నైతిక విలువలుంటే సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.