ఏపీలో తగ్గని ఉధృతి: మళ్లీ భారీగా సంఖ్యలో కరోనా కేసులు: రోజురోజుకూ..గంటగంటకూ: అదే సీన్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతిలో ఏ మార్పూ ఉండట్లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో దేశంలోని మిగిలిన రాష్ట్రలతో పోల్చుకుంటే ఏపీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నప్పటికీ.. కొత్త కేసులు గంటగంటకూ పుట్టుకుని రావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కంటైన్మెంట్ జోన్లలో కఠిన చర్యలను అమలు చేస్తున్నప్పటికీ.. దాని విజృంభణకు అడ్డుకట్ట పడట్లేదని అంటున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 50 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల సందర్భంగా 50 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 24 గంటల వ్యవధిలో మొత్తం 9,831 మందికి చెందిన శాంపిళ్లను పరీక్షించామని తెలిపారు.
వారిలో 50 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందని అన్నారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3427కు చేరుకుంది. ఇందులో 2294 మంది డిశ్చార్జి అయ్యారు. 73 మంది ఇప్పటిదాకా చనిపోాయారు.
24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనా పేషెంట్లు మరణించగా రాష్ట్రవ్యాప్తంగా 21 మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1060గా నమోదైంది. కాగా..విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 123 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
వారిలో నలుగురు డిశ్చార్జి అయ్యారు. 119 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారిలో ఇప్పటిదాకా 700 మందికి వైరస్ సోకింది. వారిలో 258 మంది డిశ్చార్జి అయ్యారు. 442 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.