గుజరాత్ నుంచి ఏపీకి వచ్చిన వారికి సోకిన కరోనా: 14 మందికి: కర్నూలులో 500 ప్లస్.. !
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయే తప్ప.. దాని తీవ్రత ఎక్కడా తగ్గట్లేదు. కొత్తగా రాష్ట్రంలో మరో 67 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనివే. గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 14 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1717కు చేరింది.
హైలీ ఇన్ఫ్లేమబుల్: మైండ్ బ్లాక్ అయ్యేలా పెట్రో రేట్స్: డీజిల్పై రూ.7కు పైగా
24 గంటల వ్యవధిలో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 25, గుంటూరులో 13 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గుజరాత్ నుంచి వచ్చిన 14 మందికి వైరస్ సోకగా.. వారిని ఏ రాష్ట్రం జాబితాలోనూ చేర్చలేదు. ఇతరులుగా గుర్తించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తాజా బులెటిన్లో వెల్లడించారు. కృష్ణాజిల్లాలో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం, కడప, విశాఖపట్నంలల్లో రెండు చొప్పున, నెల్లూరులో ఒక కేసు 24 గంటల వ్యవధిలో నమోదు అయ్యాయి.
గుజరాత్ నుంచి ఏపీకి వచ్చిన వారిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన వారే అధికంగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒకవంక పెరుగుతున్నప్పటికీ.. కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్యలో వేగం పెరగడం ఊరట కలిగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా 589 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని, వేర్వేరు ఆసుపత్రుల నుంచి వారంతా డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మృతుల సంఖ్య 34కు చేరుకుంది.
కొత్తగా నమోదైన 25 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా 500 మార్క్ను దాటేసింది. మొత్తం 516 పాజిటివ్ కేసులు ఆ జిల్లాలో నమోదు అయ్యాయి. ఇక్కడ యాక్టివ్గా ఉన్న కేసులు 392. ఇప్పటిదాకా 114 మంది డిశ్చార్జి అయ్యారు. 10 మంది మరణించారు. గుంటూరులొో మొత్తం కేసుల సంఖ్య 351 కాగా.. 215 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 128 మంది ఈ జిల్లాలో డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది వైరస్ వల్ల చనిపోయారు. కర్నూలు, గుంటూరు తరువాత డిశ్చార్జి అయిన వారి సంఖ్యలో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి.