ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: మూడు రోజులపాటు అలర్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగితా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
కాగా, ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మద్దిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భీమవరం, పెనరవాయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుందూ నీటి మట్టం మరింత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
భారీ వరద పోటెత్తుతుండటంతో కర్నూలు సుంకేసుల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. దీంతో 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ ఫ్లో 34,931 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 33,936 క్యూసెక్కులు ఉంది. భారీ వర్షాలతో ఇతర ప్రాజెక్టులు కూడా వరదనీటితో నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. గరిష్ట నీటిమట్టానికి చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మరోవైపు, హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.