ఎన్టీఆర్కు అండగా నిలవడం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దాకా: ఇదీ వెంకయ్య
అమరావతి: కేంద్రమంత్రి- వెంకయ్య నాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సోమవారం సాయంత్రంప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రధానంగా వెంకయ్య పేరు వినిపించింది.
అయితే, వెంకయ్య నాయుడు మాత్రం క్రియాశీలక రాజకీయాల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లాలని భావించారు.
అంతిమంగా నిర్ణయం ప్రధాని మోడీకే వదిలేశారు. యూపీఏ తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీ ఉన్నారు. ఎన్డీయే పక్షాల మద్దతుతో పాటు ఇతర పార్టీలు మెచ్చే సరైన అభ్యర్థి వెంకయ్య అని బిజెపి అధిష్టానం భావించింది. కాగా, పార్లమెంటు సెంట్రల్ హాలులో పలువురు ఎంపీలు సోమవారం వెంకయ్యకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
వెంకయ్యే ఎందుకంటే..
వివిధ కారణాల రీత్యా అధిష్ఠానం మాత్రం వెంకయ్య వైపే మొగ్గు చూపడానికి పలు కారణాలు ఉన్నాయి. రాజ్యసభకు ఛైర్మన్గా ఉప రాష్ట్రపతి వ్యవహరించాల్సి ఉంటుంది. దానికి వెంకయ్య లాంటి వారే సరితూగుతారని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అమిత్ షా పార్టీ అభిప్రాయాన్ని చెప్పినప్పటికీ వెంకయ్య మాత్రం ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నట్లు మోడీకి చెప్పనున్నారు.
Recommended Video
ఇదీ కుటుంబం
వెంకయ్య నాయుడు 1 జూలై 1949లో జన్మించారు. ఆయన తండ్రి రంగయ్య, తల్లి రమణమ్మ. ఆయన వయస్సు 68. నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. 1971 ఏప్రిల్ 14న ఉషతో పెళ్లయింది. ఆయనకు ఇద్దరు పిల్లలు. హర్షవర్ధన్, దీపా.
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు
విఆర్ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు వచ్చాయి. 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
ప్రజాప్రతినిధిగా అడుగులు
1977-80 మధ్య జనతా పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడిగా పని చేశారు. 1978లో ఉదయగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో మళ్లీ ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తొలిసారి రాజ్యసభకు...
1985లో ఏపీ బిజెపి కార్యదర్శి అయ్యారు. 1988 ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పని చేశారు. 1998లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వాజుపేయి హయాంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.
బీజేపీ అధ్యక్షుడిగా.. ఎన్టీఆర్కు అండగా..
2002 జూలై 1వ తేదీ నుంచి 2004 అక్టోబర్ 5 వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మొదటి నుంచి వెంకయ్య బిజెపిలోనే ఉన్నారు. ఆగస్ట్ సంక్షోభం సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అండగా నిలిచారు. ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పరేడ్ వెంకయ్య ఆలోచనగా చెబుతారు.
మోడీ ప్రభుత్వంలోను కీలకపాత్ర
వెంకయ్య నాయుడు మోడీ ప్రభుత్వంలోను కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యూహాలు రచించడంలో దిట్ట. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రధాని మోడీ మన్ననలు అందుకుంటున్నారు. దక్షిణాదిలో బిజెపికి వెంకయ్యనే పెద్ద దిక్కు అని చెప్పవచ్చు. కర్నాటకలో బిజెపి అధికారంలోకి రావడంలో ఆయన కృషి కూడా ఉంది.