లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీలో పేదల ఆకలి కేకలు- చేతులెత్తేసిన ప్రభుత్వం- స్వచ్ఛంద సంస్ధల ఆపన్నహస్తం..
ఏపీలో కరోనా వైరస్ భయాలతో అన్ని దేవాలయాలు, వాటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు మూతపడ్డాయి. వీటి ప్రభావం నిత్యం వీటిపై ఆధారపడి జీవించే నిరుపేదలు, యాచకులపై పడింది. రోజూ ఏదో ఒక గుడికో, అన్నదాన సమాజానికో వెళ్లి కడుపు నింపుకునే వీరంతా ప్రభుత్వ నిర్ణయంతో ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో వీరిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు.

కరోనా భయాలు- దేవాలయాల మూత..
కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందన్న భయాలతో వారం రోజుల క్రితమే ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు మూతపడ్డాయి. వీటికి అనుబంధంగా పనిచేస్తున్న అన్నదాన సమాజాలు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో వీటిపైనే ఆధారపడి రోజూ కడుపునింపుకునే వేలాది మంది నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్న పరిస్ధితి. తెలంగాణ తరహాలో ఏపీలో అన్నపూర్ణ క్యాంటీన్లు కానీ ఇతర ఏర్పాట్లు కానీ లేకపోవడంతో వారి పరిస్ధితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది.

రంగంలోకి స్వచ్చంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు..
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ లాక్ డౌన్ పరిస్ధితుల నేపథ్యంలో పేదలకు, యాచకులకు పట్టెడన్నం దొరికే పరిస్దితి లేకపోవడంతో వారి పరిస్ధితి చూసిన స్వచ్ఛంద సంస్దలు, సామాజిక కార్యకర్తలు ఎక్కడికక్కడ రంగంలోకి దిగుతున్నారు. పేదల ఆకలిని అర్దం చేసుకుని అందిన కాడికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. కార్పోరేట్లు ప్రభుత్వాలకు చేసే సాయం తమకు ఎలాగో అందదని ముందే తెలుసు కాబట్టి సొంతంగా విరాళాలు సేకరించుకుని మరీ పేదల కడుపు నింపేందుకు తపిస్తున్నారు.

ఆంక్షల వలయం ఛేదించుకుని మరీ..
ఏపీ వ్యాప్తంగా కరోనా భయాలతో ఇప్పుడు ఎవరినీ బయటికి రానిచ్చే పరిస్ధితి లేదు. పోలీసులు కాపు కాసి అందరినీ అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడం, పలుచోట్ల దాడులు చేయడం కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకొస్తున్న వారికి సైతం ఈ బాధలు తప్పడంం లేదు. అయినా ఎలాగోలా పోలీసులను, స్ధానిక అధికారులను ఒప్పించి మరీ పేదలకు భోజనం పెట్టేందుకు ఆయా సంస్ధలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల వీరికి ఆటంకాలు తప్పడం లేదు.

మరికొన్ని చోట్ల విధుల్లో పోలీసులకు సైతం..
ఏపీలో ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్క హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ తెరుచుకునే పరిస్ధితి లేదు. తెరిచి ఉన్నా కొనే కస్టమర్లు లేరు. దీంతో ఇప్పుడు కరోనా లాక్ డౌన్ అమలు చేస్తున్న పోలీసులకు కూడా ఆకలి కేకలు తప్పడం లేదు. దీంతో పలుచోట్ల స్వచ్ఛంద సంస్దలు పోలీసుల ఆకలి కూడా తీర్చేందుకు ముందుకొస్తున్నారు. ఆకలికి ఎవరైనా ఒక్కటే అన్న వాస్తవాన్ని గుర్తించి వారికి భోజనం అందిస్తున్నారు. అదే సమయంలో పేదలకు, అన్నార్తులకు సైతం కడుపు నింపే అవకాశం కల్పించాలని పోలీసులను కోరుతున్నారు. దీంతో స్ధానికంగా వీరికి కొంత మేర ఊరట కల్పించేందుకు పోలీసులు సైతం ముందుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications