ఏపీలో నైట్కర్ఫ్యూ అమలులో మార్పు: సంక్రాంతి తర్వాత నుంచే, ప్రజలకు భారీ ఊరట
అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పు చేసింది. మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయంలో కొన్ని కీలక మార్పులు చేస్తూ.. ప్రభుత్వం మరో ఉత్తర్వులను జారీ చేసింది.
Recommended Video

పండగకు సొంతూళ్లకు ప్రజలు
సంక్రాంతి తర్వాత కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు తాజా ఉత్తర్వుల్లో తెలిపింది ఏపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. సోమవారం రాత్రే ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కానీ, మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండగ రానుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తమ సొంతూళ్లకు రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యంగా.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వేలాదిగా ప్రజలు తరలివెళ్తున్నారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ
బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు.. భారీ సంఖ్యలో ఏపీ వైపు వెళ్తున్నాయి. రిజర్వేషన్లు దొరకని వాళ్లైతే.. సొంత వాహనాలు, స్నేహితులు, బంధువుల వాహనాల్లో తమ ఊళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. నైట్ కర్ఫ్యూ ఆంక్షలతో ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులు సవరించింది. సంక్రాంతి పండగ తర్వాత నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్టు తెలిపింది.

కోవిడ్ మార్గదర్శకాలతో ప్రయాణాలు
మరోవైపు, బస్సుల్లో ప్రజలంతా మాస్కులు ధరించే ప్రయాణాలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు తగిన సూచనలు చేసింది. ప్రజలు కూడా.. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ.. ప్రయాణాలు చేయాలని కోరింది. బస్సుల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని స్పష్టం చేసింది. కాగా, సంక్రాంతి తర్వాత నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందన్న వార్తలతో.. ప్రజలకు భారీ ఉపశమనం లభించినట్లయింది.

ప్రజలు ఇబ్బంది పడకూడదనే: మంత్రి పేర్నినాని
పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని సూచించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.












Click it and Unblock the Notifications