ఏపీలో మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్ట్ లు ? త్వరలో చట్ట సవరణ బిల్లు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం కార్మిక రంగ సంస్కరణలు చేపట్టేందుకు సిద్దమవుతోంది. పరిశ్రమలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకు పరిశ్రమల చట్టం 1948లో మార్పులు చేయబోతోంది. ఈ మేరకు చట్టంలో పలు సవరణలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న కేబినెట్ భేటీలో వీటిని చర్చించి ఆమోదముద్ర కూడా వేసింది. ఈ మేరకు త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 202ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది.
తాజా సవరణ చట్టంలో పరిశ్రమలపై విధానపరమైన భారాలను తగ్గించడానికి వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మహిళలకు పరిశ్రమల్లో నైట్ షిఫ్ట్ ల్లో అనుమతించేందుకు వీలుగా చట్ట సవరణ చేయబోతున్నారు. మహిళలు తగినంత భద్రత, రవాణా సౌకర్యాలతో రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనుమతిస్తామని సమాచార మంత్రి పార్ధసారధి వెల్లడించారు. తద్వారా పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అలాగే ఈ బిల్లులో మహిళా ఉద్యోగులు రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య రాత్రి షిఫ్టులలో పని చేయడానికి అనుమతిస్తామని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఉద్యోగుల ముందస్తు లిఖిత అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఇలా నైట్ షిఫ్ట్ ల్లో పనిచేసేందుకు అనుమతిస్తారు. అలాగే వారికి పికప్, డ్రాప్ సౌకర్యాలు, ఇతర భద్రతా చర్యలను అందించిన తర్వాత మాత్రమే దీన్ని వర్తింపచేస్తామని కూడా మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించే విషయాత్వం పరిశీలిస్తోంది. అలాగే మిగతా ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇప్పుడు పరిశ్రమల చట్టంలో మార్పులు చేసి మహిళా ఉద్యోగుల్ని నైట్ షిఫ్ట్ లలోనూ అనుమతించబోతోంది. వీటి ద్వారా పరిశ్రమల్లో ఉత్పాదకత పెరగడంతో పాటు వాటిపై భారం తగ్గుతుందని అంచనా వేస్తోంది..












Click it and Unblock the Notifications