చినరాజప్ప ఇలా చేశారేంటి?: సీఎం సమక్షంలో రామానుజయకు అవమానం!
అమరావతి: హోంమంత్రి చినరాజప్ప వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలోనే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ పట్ల అనుచితంగా వ్యవహరించడం కలకలం రేపింది.
సోమవారం సీఎం చంద్రబాబునాయుడు టీడీపీ, కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామానుజయులు మాట్లాడుతుండగా.. హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా ఆయన వద్ద నుంచి మైక్ లాక్కున్నారు.
ఒక్కసారిగా చిన్నరాజప్ప వ్యవహరించడంతో రామానుజయతోపాటు అక్కడనున్నవారు ఆశ్చర్యపోయారు. అయితే అందరూ స్తబ్దుగానే ఉన్నారు. కాగా, ఈ సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ.. కాపులను బీసీల్లో చేర్చడం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడమే సీఎం చంద్రబాబు ప్రధాన ఆశయమని, చంద్రబాబు కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు.
స్వలాభం కోసం కొందరు కాపులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కాపులకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేని చినరాజప్ప పేర్కొన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని, విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కావాలని సీఎంను కోరతామన్నారు. ఓ రాజకీయ పార్టీ చేతిలో ముద్రగడ కీలుబొమ్మ అని ఎద్దేవాచేశారు. ఈ ఏడాదిలోనే రిజర్వేషన్లు సాధిస్తామని చినరాజప్ప మరోసారి స్పష్టం చేశారు.