వంగవీటి రాధా హత్య కుట్ర, రెక్కీ వెనుక షాకింగ్ విషయాలు చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
వంగవీటి రాధా ను హతమార్చడానికి రెక్కీ నిర్వహించడం వెనుక వైసిపి హత్యా రాజకీయాలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపణలు గుప్పించారు. ఓవైపు హత్య రాజకీయాలకు పాల్పడుతూనే, మరోవైపు సెక్యూరిటీ కల్పిస్తామని డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. వంగవీటి రంగా గురించి, వంగవీటి రాధాపై జరిగిన రెక్కీ గురించి వైసీపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించింది ఎవరు?
అసలు వంగవీటి రాధాను వైసీపీ ఇన్చార్జి పదవి నుండి తప్పించి, ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అవమానించారని జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపణలు గుప్పించారు. వంగవీటి రంగా బొమ్మను అడ్డంపెట్టుకుని గెలిచి వంగవీటి రంగా కుటుంబానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. కాపులకు మిత్రులు ఎవరు శత్రువు ఎవరు? కాపులకు సహకరిస్తున్నది అణగదొక్కుతుంది ఎవరు అన్నది తెలుసుకో లేని పరిస్థితుల్లో కాపులు ఎవరూ లేరని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి కాపులను ఏ విధంగా మోసం చేశారో కాపులు అందరు గమనిస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

రంగా హత్యకేసు నిందితులు, సపోర్ట్ చేసిన వారికి పదవులు ఇచ్చింది మీరు కాదా ?
రంగా హత్య కేసులో ప్రధాన ముద్దాయి అయిన దేవినేని నెహ్రూ హైదరాబాద్ లో 300 కోట్ల విలువైన భూములను అప్పజెప్పలేదా ? అంటూ నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. రంగాని చంపటం తప్పుకాదని బహిరంగంగా చెప్పిన గౌతమ్ రెడ్డి కి నేడు ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చారని దుయ్యబట్టారు. దేవినేని నెహ్రూ రంగా హత్య కేసులో ముద్దాయి అయితే, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ను అక్కున చేర్చు కోవడంలో అర్థం ఏమిటో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జగన్ ను ప్రశ్నించారు. వంగవీటి రాధా హత్య చేయాలని ప్రయత్నిస్తుంది వైసిపి నాయకులేనని ఆయన తేల్చి చెప్పారు.

అరవ సత్యం రెక్కీ చెయ్యటం వెనుక ఉంది జగన్ కాదా ?
రాధా హత్యకు కుట్ర పన్ని రెక్కీ నిర్వహించిన వ్యక్తి అరవ సత్యం వైసీపీ విజయవాడ శాఖ ఫ్లోర్లీడర్ కాదా అంటూ ప్రశ్నించారు. టిడిపి ఆఫీస్ పై దాడి చేసిన వారిలో అరవ సత్యం ఉన్నారని, అప్పుడు జగన్ మోహన్ రెడ్డి అతని అభినందించారు అంటూ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి మెచ్చుకోవడంతో, జగన్మోహన్రెడ్డి మెప్పు పొందడం కోసం ఇప్పుడు అరవ సత్యం వంగవీటి రాధా పై రెక్కీ నిర్వహించారని, రాధా హతమార్చడం ద్వారా జగన్ కు దగ్గర కావాలని కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తేల్చిచెప్పారు.

రంగా విగ్రహావిష్కరణకు వెళ్ళినా వైయస్ జగన్మోహన్ రెడ్డి చిందులు తొక్క లేదా?
వంగవీటి రాధా పార్టీ నుండి బయటకు వచ్చిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపం బయట పెట్టారని స్వయంగా ఆయనే జగన్ ఏవిధంగా అణచివేతలకు పాల్పడతారు చెప్పారని వెల్లడించారు. అదే సమయంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణకు వెళ్లిన వారిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి చిందులు తొక్క లేదా అంటూ ప్రశ్నించారు.

వంగవీటి రంగా హత్యతో కుల రాజకీయాలతో నాడు గద్దెనెక్కారు
గతంలో 2004వ సంవత్సరంలో కాపులను బీసీల్లో చేర్చడానికి సర్వే చేయడం కోసం, కాపులు అందరూ కలిసి 46 లక్షల రూపాయలు ప్రభుత్వాన్ని అడిగితే నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అలాంటివాళ్లు కాపుల సంక్షేమం గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
1989లో వంగవీటి రంగా హత్య తరువాత కుల రాజకీయాలతో గద్దెనెక్కారు అని గుర్తు చేశారు. కాపుల ఓట్లతో గెలిచి కాపులకు ఏం చేశారో చెప్పాలని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు . వంగవీటి రాధా ఇంటిపై రెక్కీ నిర్వహించిన దోషుల్ని జైలు పాలు కాకుండా జగన్మోహన్రెడ్డి కాపాడుతున్నారని మండిపడ్డారు.
Recommended Video

ఇప్పుడు రాధాను హతమార్చి అధికారంలోకి రావాలనే కుట్ర
అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు అని గతంలో 1989లో వంగవీటి మోహన్ రంగా హత్య ద్వారా కాపులు కమ్మ కులానికి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా అదే విధంగా వంగవీటి రాధా హతమార్చి కుల విద్వేషాలను పెంచి మళ్లీ అధికారంలోకి రావాలని వైసిపి నాయకులు కుట్ర చేస్తున్నారని నిమ్మల రామానాయుడు జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు. వంగవీటి రాధా హత్య కుట్రపై సంచలన ఆరోపణలు చేశారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో అభివృద్ధిలోనూ, సంక్షేమం లోను పూర్తిగా వైఫల్యం చెందిందని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications