నిరుద్యోగ భృతి: పవన్ కళ్యాణ్ దెబ్బేనా? జగన్కు చంద్రబాబు ఆయుధం!
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ ఓ ఆయుధం ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. నిరుద్యోగ భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తోంది. కానీ దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించి, అధికార పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.
చట్టంలో ఉందిగా మోడీకి ఇబ్బందేంటి!: టీడీపీ ఎంపీలతో రాష్ట్రపతి, కేశినేనికి మమత ప్రశంస
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు రూ.2వేలు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. కానీ నాలుగేళ్ల పాటు దీనిపై కదలిక లేదనేది విపక్షాల వాదన. ఇప్పుడు హఠాత్తుగా నిరుద్యోగ భృతిని తెరపైకి తీసుకు రావడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు ముఖ్యంగా జనసేన అధినేత పవన్.
అందుకే ఇప్పుడు నిరుద్యోగ భృతి!
ఇటీవలి వరకు పవన్ను తెలుగుదేశం పార్టీ మిత్రుడిగానే చూసింది. కానీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. పవన్కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన మాట్లాడుతూ... యువత అంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు. పవన్ వైపు యువత మొగ్గు చూపుతుందనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లకు నిరుద్యోగ భృతిని తెరపైకి తెచ్చారని గతంలోనే భావించారు. ఇదే అభిప్రాయం పవన్ కూడా వ్యక్తం చేశారు.
ఆలస్యం.. సగం.. రెండు ఆయుధాలు
దాదాపు నాలుగున్నరేళ్లకు ఏపీ కేబినెట్ నిరుద్యోగ భృతికి ఆమోదం తెలిపింది. అయితే, నాడు ఎన్నికల్లో రూ.2వేలు ఇస్తానని ప్రకటించారు. కానీ రూ.1000 ఇస్తామని చెబుతున్నారు. ఇది విపక్షాలకు ఓ ఆయుధమే అంటున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పటికే ఆలస్యం కావడం, ఎన్నికలకు ముందు దానిని తెరపైకి తేవడం ఓ కారణమైతే, చెప్పిన దానికంటే సగం ఇవ్వడం మరో కారణం అంటున్నారు. ఇవి వైసీపీ, జనసేనలకు ఆయుధాలే అంటున్నారు.
నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి?
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి అంశంపై విమర్శలు గుప్పిస్తోంది. రూ.2వేలు ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పి, ఈ రోజు రూ.1000 అంటున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. నిరుద్యోగులను మళ్లీ మోసం చేయవద్దన్నారు.
విమర్శల జడివాన
జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై పలు అంశాలపై మండిపడుతున్నాయి. అమరావతి రాజధాని మొదలు పోలవరం దాకా అక్రమాలు అంటూ విమర్శలు గుప్పించడంతో పాటు ఇచ్చిన హామీల్లో ఏవీ నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. కాపు రిజర్వేషన్ కూడా ఇస్తామని చెప్పి ఇన్నాళ్లయినా ఏం చేయలేరని మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో, ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి పేరుతో యువతను ఆకట్టుకోవాలని టీడీపీ అనుకుంటే వైసీపీ, జనసేనలకు ఆయుధం దొరికిందని అంటున్నారు.