నీతి ఆయోగ్ మీట్: 'ప్రత్యేక హోదా' ప్రస్తావించిన జగన్... ప్రైవేట్ రంగానికి ఊతమివ్వాలన్న మోదీ...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్దిలో రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. శనివారం(ఫిబ్రవరి 20) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ అనుబంధ రంగంపై జగన్ కీలక వ్యాఖ్యలు...
పీఎఫ్సీ,ఆర్ఈసీ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11శాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని సీఎం అన్నారు. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2శాతం నుంచి 3శాతానికి మించడం లేదని గుర్తుచేశారు. రుణాలపై అధిక వడ్డీలు,విద్యుత్ ఖర్చులు భారంగా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మంచి పనితీరు కనబర్చే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోందన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలు అవసరం ఉందన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడం,నాణ్యమైన విత్తనాలు అందించడం,సర్టిఫై చేసిన ఎరువులు,పురుగు మందులను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పంటల నిల్వ,గ్రేడింగ్,ప్రాసెసింగ్ కోసం కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలన్న మోదీ...
ఇదే సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రాలన్నీ సమన్వయంతో ముందుకు సాగితేనే సమాఖ్య స్పూర్తికి అర్థమని పేర్కొన్నారు. రాష్ట్రాలతో పాటు జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్పూర్తి నెలకొనాలన్నారు. భారత్ను ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దే క్రమంలో ప్రైవేట్ రంగానికి మరింత ఊతమివ్వాలని... ఆ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని అన్నారు. తద్వారా భారత్ స్వయం స్వావలంభన సాధిస్తుందన్నారు.కరోనా సమయంలో వైరస్ను ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయన్నారు. ఆ సమాఖ్య స్పూర్తితో ముందుకు సాగడమే దేశ అభివృద్దికి పునాది అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో దేశం విజయం సాధించిందని.. ప్రపంచ దేశాల ముందు భారత ఖ్యాతి పెరిగిందని అన్నారు.
బడ్జెట్పై సానుకూలత వ్యక్తమైందని...
ఈ ఏడాది బడ్జెట్పై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వచ్చిందన్నారు మోదీ. భారత్ వేగంగా అభివృద్ది చెందాలనుకుంటోందని... యువత అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కేంద్ర పథకాలు ప్రతీ ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు కల్పించామన్నారు. పేదలకు ఉచిత విద్యుత్,గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. వైద్య,ఆరోగ్య సదుపాయాలను మెరుపరిచామని చెప్పారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన 6వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్నాథ్ సింగ్,పీయూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్,నీతి ఆయోగ్ సభ్యులు హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వినిపించారు.