కాంగ్రెస్తో పొత్తు లేదు, ఒంటరిగానే: తేల్చేసిన కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండబోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు తేల్చి చెప్పారు. శనివారం కెసిఆర్ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో విలీనమే కాదు, పొత్తు కూడా ఉండదని స్పష్టం చేశారు. తమ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇప్పుడు ఎవరు టిఆర్ఎస్ పార్టీని వీడతారో.. ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరతారో చూస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కానీ, విలీనానికి కానీ అంగీకరించడం లేదని కెసిఆర్ చెప్పారు. రేపట్నుంచి మీ సంగతెంటో చూస్తాం.. మా సంగతెంటో చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఏం ద్రోహం చేశానో చెప్పాలని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ కోసం అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్లే తెలంగాణ ఇస్తే.. తాను కాంగ్రెస్ అధిష్టానంతో విలీనం విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు.
అయితే అందుకోసం తాను ఢిల్లీలో నెలరోజులపాటు ఉంటే.. స్పందించని కాంగ్రెస్ ఇప్పుడు విలీనం.. పొత్తు అంటోందని ఆరోపించారు. పొత్తు పెట్టుకుంటామని మాపై విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పారు. 100 ఎమ్మెల్యే స్థానాలు, 15 ఎంపి స్థానాలు గెలుచుకుందామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, ఉద్యోగాల కోసమని, ఇప్పుడు ఉద్యోగాల పంపిణీ పేరుతో అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు 5శాతం మాత్రమే ఉన్నారని, వారు కూడా వాచ్మెన్లు, చప్రాసీలేనని తెలిపారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా చేసేందుకు అనేక కుట్రలకు పాల్పడ్డారని, అవన్ని తట్టుకుని తెలంగాణ కోసం ఎదురు నిలిచామని చెప్పారు. తన స్థానంలో ఎవరైనా ఎప్పుడో పారిపోయేవారని తెలిపారు. పొన్నాల ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులకు ఒప్పుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన యువకులు వారి సూసైడ్ నోట్లో కాంగ్రెస్ నాయకుల పేర్లే రాశారని తెలిపారు. అప్పుడు పిల్లలను చంపి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారట అని కెసిఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కో విద్యార్థిపై వంద కేసులు పెట్టారని, అప్పుడు కూడా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడలేదని అన్నారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటుందని అన్నారు.
మంచిర్యాలలో 70 శాతం మంది ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని కెసిఆర్ చెప్పారు. మంచిర్యాల ప్రాంతాన్ని ఎంపి వివేక్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తానని కెసిఆర్ చెప్పారు. కడెం మీద మరో ఐదు ప్రాజెక్టులు నిర్మించి, రైతులు రెండు పంటలు పండించేలా చేస్తానని చెప్పారు. తెలంగాణ తెస్తానని చెప్పానని, లేదంటే తనను రాళ్లతో కొట్టి చంపండని కూడా చెప్పానని.. అందుకే ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వదలేదని కెసిఆర్ తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ గెలుపు అంటే తెలంగాణ ప్రజల గెలుపేనని అన్నారు. యుద్ధం చేసే వ్యక్తి చేతిలోనే కత్తి పెట్టాలని కెసిఆర్ అన్నారు. 15 ఎంపి స్థానాలను గెలుచుకుని ఢిల్లీని శాసించాలని చెప్పారు.