మోడీ టూర్ తో ఒరిగిందేంటి ? జగన్ అడిగిన వాటిపైనా స్పందన కరవు ! కేంద్ర పథకాల డప్పు !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సాగిస్తున్న అనుబంధం ఏదో ఒక రోజు రాష్ట్రానికి తప్పకుండా మేలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్నారంటే ఏదో ఒక పాత హామీ అయినా నెరవేరుతుందని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ లేకుండా ఒట్టి చేతులు చూపించి వెళ్లిపోతుంటే జనం నిశ్చేష్టులై చూడాల్సి వస్తోంది. జనమే కాదు ఆ జనం ఎన్నుకున్న సీఎం జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్ధితులు కనిపిస్తున్నాయి. మోడీ వైజాగ్ టూర్ లోనూ ఇదే జరిగింది.
మోడీ వైజాగ్ టూర్
ప్రధాని మోడీ వైజాగ్ టూర్ నిన్న సాయంత్రం ప్రారంభమై ఇవాళ మధ్యాహ్నం ముగిసింది. నిన్న సాయంత్రం ఐఎన్ఎస్ చోళకు చేరుకున్న ప్రధాని అనంతరం పవన్ కళ్యాణ్ తో భేటీ, బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత రెస్ట్ తీసుకున్నారు. ఇవాళ ఉదయం తిరిగి సీఎం జగన్ తో కలిసి విశాఖ ఏయూ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుని శంఖుస్ధాపనలు పూర్తి చేసి ప్రసంగం చేసి వెళ్లిపోయారు. దీంతో ప్రధాని మోడీ టూర్ తో ఏపీకి జరిగిన లాభమేంటన్న చర్చ సాగుతోంది.
నిరాశపర్చిన మోడీ టూర్
ప్రధాని మోడీ ఏపీకి రానుండటంతో ఏదో జరిగిపోతుందని భావించిన వారందరికీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఐదు ప్రాజెక్టులకు శంఖుస్దాపనలు, మరో రెండు ప్రాజెక్టులు జాతికి అంకితం చేసేందుకు విశాఖవచ్చిన ప్రధాని మోడీ.. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒక ప్రకటన చేస్తారని అంతా భావించారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రధాని మోడీ ముందు రాష్ట్రానికి సంబంధించిన కోర్కెల చిట్టా పెట్టారు. అయినా తనకేం తెలియనట్లుగానే వ్యవహరిస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసంటూ చెప్పి వెళ్లిపోయారు. దీంతో జగన్ కు సైతం నిరాశ తప్పలేదు.
జగన్ అడిగిందేంటి ?
కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమని, తమకు మరో ఎజెండా లేదని సీఎం జగన్ ఇవాళ మోడీ సభలోనే చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహకారాలు మరింత కావాలని కోరారు. ఎనిమిదేళ్ల కిందటినాటి విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదని, విభజన హామీలైన పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.. ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరారు. పెద్దలు సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని అడిగారు. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలన్నారు.మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం అని ప్రధాని సమక్షంలోనే జగన్ విజ్ఞప్తి చేశారు.
ప్రధాని చేసిందేంటి ?
సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించి కీలక సమస్యల్ని ప్రధాని మోడీ ముందు ఏకరువు పెడితే ఆయన మాత్రం మాటమాత్రంగా కూడా వాటిపై స్పందించలేదు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో మాత్రం చెప్పుకున్నారు. జాతీయ స్ధాయిలో కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ వంటి పథకాల గురించి, ఉచిత రేషన్ గురించి కూడా మాట్లాడారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. కానీ ఏపీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి కానీ, విభజన హామీలైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి మాత్రం మాటమాత్రం ప్రస్తావించలేదు. దీంతో ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో సీఎం జగన్ సైతం అసహనంగా కనిపించారు.