సిఎం మార్పు లేదు, విభజనకు సహకరిస్తారు: డిగ్గీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని, క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా విభజనకు సహకరిస్తారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీకి ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం రాజకీయంగా తీసుకుంది కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
పార్లమెంటులో అన్ని పార్టీలు సహకరిస్తే ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సీమాంధ్రలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని ఆయన అన్నారు. సీమాంద్ర సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తుందా, రాదా అనే విషయం ఇప్పుడే చెప్పలేనని, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన తర్వాత చెప్తానని ఆయన అన్నారు. అసెంబ్లీకి తీర్మానం, బిల్లు రెండూ వెళ్తాయని తనకు గతంలో హోం శాఖ చెప్పిందని ఆయన అన్నారు.
ఇంతకు ముందు తెలంగాణపై శాసనసభ ఏ విధమైన తీర్మానం చేయలేదని, ఈ విషయంలో తాను గతంలో చేసిన వ్యాఖ్యలను సరి చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. తెలంగాణపై గతంలో శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగిందని, సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతనే విభజనపై నిర్ణయం తీసుకోవాలని గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని ఆయన వివరించారు. ఎన్నికలకు ముందే విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లును శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
ఆంటోనీ కమిటీ అస్తిత్వంలోనే ఉందని, ఆంటోనీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. సీమాంధ్రలో రాజధానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ వ్యయంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాదులోని, తెలంగాణలోని సీమాంధ్ర ప్రజల భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీలు గతంలో తెలంగాణకు అనుకూలంగా చెప్పాయని, అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే చివరగా కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు.
తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకోవడం వల్ల విశ్వసనీయతను కోల్పోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో తెరాస విలీనం ప్రతిపాదన ఏదీ లేదని, తెరాస అటువంటి ప్రతిపాదన చేయలేదని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులతో చర్చించిన తర్వాత ఆ విషయంపై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు.