అవిశ్వాసం, కేంద్రంపై పోరాటం: టీడీపీకి అండగా ఉంటామన్న కనిమొళి
చెన్నై: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి డీఎంకే నైతిక మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ కనిమొళి అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సోమవారం చెన్నైలో కనిమొళితో సమావేశమయ్యారు.
విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చడంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఆమెకు వివరించారు. పార్లమెంటులో తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలనే నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని, వారికి తాము అండగా ఉంటామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు నెరవేర్చాలని ఆమె ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. ఇటీవల కడపలో ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ చేపట్టిన ఆమరణ దీక్షకు కనిమొళి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.