బాబు ప్రభుత్వంపై అవిశ్వాసం, ఈ సెషన్లోనే చర్చ జరగాలి: జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గవర్నర్ ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానం తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన శనివారం మీడియాతో చెప్పారు. ఈ నెల 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభ తీర్మానం చేయనుంది.
నిబంధనల ప్రకారం తాము నోటీసు ఇచ్చిన రెండు రోజుల్లో స్పీకర్ దానిపై సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, తీర్మానం ప్రతిపాదించిన పది రోజుల్లోగా శాసనసభలో చర్చకు తీసుకోవాలని, ఈ సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని, వచ్చే సమావేశాల్లో చర్చిస్తామంటే నిబంధనలు అంగీకరించవని ఆయనఅన్నారు. ప్రభుత్వాన్ని పడగొడుతానని తాను అన్న మాటలను వక్రీకరించారని ఆయన అన్నారు.
శాసనసభా సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16 పనిదినాలు ఉంటాయి. సమావేశాలను 40 రోజులు నిర్వహించాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగాలని వైసిపి నేతలు కోరారు. అయితే, రాముడు మంచి బాలుడు అనే పద్ధతిలో వ్యవహరిస్తే చర్చలు అర్థవంతంగా సాగుతాయని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
ఈ నెల 10వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించే అవకాశం ఉంది. బడ్జెట్పై జరిగే చర్చకు యనమల ఈ నెల 17వ తేదీన సమాధానం ఇస్తారు.