'బాబుతో జూ.ఎన్టీఆర్కు విభేదాల్లేవు, ఆయన రాజకీయాలకు దూరం'
నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాల్లేవని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు.
అమరావతి: నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు నందమూరి కుటుంబంతో ఎలాంటి విభేదాల్లేవని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు.
జూ. ఎన్టీఆర్, చంద్రబాబు మధ్య విభేదాల్లేవు
నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను సోమిరెడ్డి కొట్టి పారేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని తేల్చి చెప్పారు.
జగన్ పార్టీ ఈర్ష్య
మహానాడు విజయవంతం కావడాన్ని చూసి వైసిపి ఈర్షపడుతోందని ధ్వజమెత్తారు. వారు కనీసం పార్టీ పండుగను జరుపుకోరన్నారు. లక్ష కోట్ల అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసిపి అని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ సమస్యపై వైసిపి సమగ్ర అధ్యయనం చేసిందో చెప్పాలన్నారు.
డాక్టర్ల సూచనల మేరకు జగన్ దీక్ష
సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొనే స్థాయిలో అవినీతికి పాల్పడి, వైసిపి పుట్టిందన్నారు. వైద్యుల సూచనల మేరకే జగన్ దీక్షలు చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రతి మూడు నాలుగు నెలలకు ఓసారి రెండు రోజుల దీక్షలు చేయాలని ఆయనకు డాక్టర్లు సూచించారన్నారు.
బాలకృష్ణ వివరణ
మహానాడుకు తాము రాలేకపోయినందుకు టిడిపి నేతలు బాలకృష్ణ, రాయపాటి సాంబశివరావులు వివరణ ఇచ్చుకున్నారు. తాను విదేశాల్లో షూటింగ్లో ఉన్నందున మహానాడుకు రాలేకపోయానని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అన్నారు. పలు లొకేషన్లలో సినిమా షూటింగ్ చేయాల్సి ఉందని, అందుకు తేదీలు ముందుగానే ఖరారయ్యాయన్నారు.
చంద్రబాబుకు రాయపాటి లేఖ
ఇక గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ పంపారు. తాను అనారోగ్యం కారణంగానే రాలేకపోయానని వివరణ ఇచ్చారు.