ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి - సినిమా టిక్కెట్ల పైనా : అదే ప్రభుత్వ యోచన..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా. ముఖ్యమంత్రి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా. చంద్రబాబు సైతం ముందస్తు ఎన్నికలకు సిద్దమని ఎందుకు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి ఇదే అంశం పైన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ రేపు (సోమవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలతో పాటుగా ప్రత్యేక హోదా..పోలవరం నిధుల గురించి చర్చిస్తారని చెప్పుకొచ్చారు.
ముందస్తు ఎన్నికలపై చర్చ
ఇక, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొద్ది రోజులు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. టీడీపీ ఎపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు..ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని కేడర్ కు పిలుపునిచ్చారు. దీంతో పాటుగా , తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముందస్తు ఎన్నికల పైన మాట్లాడారు. తాను ఈ సమాచారం విన్నానని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దమేనంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మిథున్ రెడ్డి క్లారిటీ
దీంతో.. 2023లోనే తెలంగాణ ఎన్నికలతో పాటుగానే ఏపీలోనూ ఎన్నికలు జరగబోతున్నాయంటూ అంచనాలు మొదలయ్యాయి. దీని పైన మిధున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఎంపీ మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామంటూ తేల్చి చెప్పారు.
అయితే, కేంద్రం జమిలి ఎన్నికల ఆలోచన ఆచరణలోకి వస్తే మాత్రం... ఆ విధంగానే ఎన్నికలు జరుగుతాయని మిథున్ రెడ్డి స్పష్టం చేసారు. టీడీపీని కాపాడుకునేందుకే చంద్రబాబునాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించారు.
సినిమా టిక్కెట్ల అంశం పైనా
ఈ అంశంతో పాటుగా సినీ టిక్కెట్లు..థియేటర్ల వివాదం పైన మిథున్ రెడ్డి స్పందించారు. ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదన్నది ప్రభుత్వ యోచన అన్నారు. సినిమా టికెట్ ధరలపై కమిటీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా తంబళపల్లికి చెందిన కొండ్రేడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసిన కొండ్రేడ్డి అనే వ్యక్తిపై చాలా కేసులు ఉన్నాయన్నారు.
కేంద్రం ఆలోచనలతోనే ముందుకు
బస్సు దోపిడీలాంటి కేసులు కూడా అతనిపై నమోదై ఉన్నాయంటూ మిథున్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు పగటికలలు కంటునే ఉన్నారని, ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ లైవ్ లోనే ఉందని ఆయన అన్నారు. దీంతో..వైసీపీలో కీలక నేతగా ఉన్న మిథున్ రెడ్డి ఇచ్చిన క్లారిటీతో ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా తెర పడే అవకాశం కనిపిస్తోంది. కానీ, జాతీయ స్థాయిలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.