జనసేనలో రాపాకకు నో ఎంట్రీ .. సభకు రావద్దని బ్యానర్ .. అదిరిపోయే షాకిచ్చిన జనసైన్యం
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు జనసేన క్యాడర్ షాకిచ్చింది . పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావద్దంటూ ఏకంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో నిర్వహించిన జనసేన సభకు రాపాక వరప్రసాద్ రావద్దంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఇప్పుడు జనసేన వర్గాల్లోనే కాకుండా, రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

జగన్ భజన చేస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అసెంబ్లీలో జనసేన తరపున ప్రజా సమస్యలపై గళం వినిపిస్తారని జనసేన పార్టీ నాయకులు అందరూ ఆశపడితే, అసెంబ్లీకి వెళ్ళిన రాపాక వరప్రసాద్ జగన్ భజన మొదలు పెట్టారు. జగన్ ని దేవుడితో పోలుస్తూ అనేకసార్లు సభలోనే పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోకున్నా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తన కుమారుడిని వైసీపీలో చేర్చారు.

జనసేన క్యాడర్ కు ఏ మాత్రం నచ్చని రాపాక తీరు ..
ఇక రాపాక వరప్రసాద్ వ్యవహార శైలి జనసేన క్యాడర్ కు ఏమాత్రం నచ్చడం లేదు. తమ పార్టీకి అసలు ఎమ్మెల్యే ఉన్నాడో లేదో కూడా తెలియదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారంటే రాపాక తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన సైనికులు రాపాక వరప్రసాద్ కు చెక్ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు . అందులో భాగంగా రాజోలు నియోజకవర్గంలో జనసేన 10 గ్రామ పంచాయతీలను గెలుచుకుంది. ఇక వైయస్ఆర్సీపీ విజయం సాధించిన గ్రామాలలో రెండో స్థానంలో జనసేన నిలిచింది.

బహిరంగ సభకు రావద్దని రాపాక పేరుతో ఫ్లెక్సీలు
జనసేన పార్టీ నుండి గెలిచి, వైసిపి భజన చేస్తున్న రాపాకకు పంచాయితీ ఎన్నికల్లో షాకిచ్చిన జనసైనికులు తాజాగా మరోమారు పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు రాపాక కు రావద్దని ఏకంగా బ్యానర్ పెట్టారు.
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం లో నిర్వహించిన సభలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేన సభ వద్ద ఎమ్మెల్యే రాపాక ఫ్లెక్సీలు పెట్టి ఎమ్మెల్యే రాపాక కు నో ఎంట్రీ, బహిరంగ సభకు రాపాక కు ప్రవేశం లేదు.. ఇట్లు మీ పల్లకీ మోసిన రాజోలు జనసైనికులు అంటూ ఏర్పాటు చేసిన బ్యానర్ రాపాక విషయంలో పార్టీ తీరును చెప్పకనే చెబుతుంది.

జనసైనికుల ఫ్లెక్సీపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు
ఇక ఈ ఫ్లెక్సీ పై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా జనసేన కార్యకర్తలకు మద్దతుగా మాట్లాడారు. జనసేన కార్యకర్తలు 2019 ఎన్నికల్లో రాపాక విజయం కోసం శ్రమించారని, రాపాక పై పోలీసుల అక్రమ కేసులు పెట్టినప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు వచ్చి అండగా నిలిచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు రాపాక వరప్రసాద్ అధికార పార్టీతో కలిసి రాజోలు లో జనసేన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ... ఇది సరైన పద్ధతి కాదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

జనసేనలో రాపాకకు ఎంట్రీ లేనట్టేనా ? రాపాక ఏమంటారో
మొత్తానికి జనసేన పార్టీలో రాపాకకు నో ఎంట్రీ అన్నది చాలా క్లియర్ గా చెప్పేశారు జనసైనికులు. ఇక నాదెండ్ల మనోహర్ కూడా అందుకు వత్తాసు పలకడంతో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు స్థానం లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది.
మరి దీనిపై రాపాక వరప్రసాద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి .












Click it and Unblock the Notifications