ప్రత్యేక హోదా: ఆ పార్టీతో పొత్తా, ఆ షరతును ఒప్పుకొంటేనే మద్దతిస్తా: వైఎస్ జగన్
విజయవాడ: ఏపీ రాష్ట్రానికి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారని హమీ ఇస్తే ఆ పార్టీకే మద్దతును ఇవ్వనున్నట్టు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రకటించారు. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఏపీ రాష్ట్రం ఈ రకమైన దుస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొంటామనే ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు.
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్ లో మంగళవారం నాడు నిర్వహించిన సభలో మాట్లాడారు. మంగళవారం నాటికి వైఎస్ జగన్ పాదయాత్ర 150వ రోజుకు చేరుకొంది.
కృష్ణా జిల్లాలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న ప్రచారంపై జగన్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్తో పొత్తుపై ప్రచారాన్ని నమ్మొద్దు
ఏపీ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై ఎవరి ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఏపీ రాష్ట్రంలోని 25 మంది ఎంపీలను వైసీపీ అభ్యర్ధులను గెలిపిస్తే ప్రత్యేక హోదాను ఎవరు ఇస్తామంటే వారికే మద్దతు తెలుపుతామన్నారు. కేంద్రంతో పోరాడి హోదాను సాధిస్తామన్నారు.
ఎత్తులకు పై ఎత్తులు
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ ఏపీ లో రాజకీయ వాతావరణం వేడేక్కింది. వైసీపీ, టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. అయితే తాజాగా జనసేన పార్టీ చీప్ పవన్ కళ్యాణ్ కూడ ఏపీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. జనసేనకు సుశిక్షితులైన కార్యకర్తలున్నారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయనుంది. అయితే టిడిపి ఒంటరిగా పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు వైసీపీ, బిజెపిలు ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీతో పొత్తును పెట్టుకొంటారనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
25 ఎంపీలను గెలిపించాలన్న బాబు
ఏపీ రాష్ట్రంలోని 25 మంది ఎంపీ స్థానాల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపిస్తే ప్రధానమంత్రి అభ్యర్ధిని తామే నిర్ణయిస్తామని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. తిరుపతి ధర్మపోరాట దీక్ష సందర్భంగా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని మరోసారి బాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. 25 మంది ఎంపీలను గెలిపించాలని కోరారు.ప్రధానిని నిర్ణయించే ఛాన్స్ వస్తే రాష్ట్రానికి దక్కాల్సిన నిధులను రాబట్టుకోవచ్చని చంద్రబాబునాయుడు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా కీలకం
ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం కీలకంగా మారనుంది. గత ఎన్నికల సమయంలో బిజెపి టిడిపి నేతలు చేసిన ఎన్నికల ప్రచారాన్ని విపక్ష వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారంగా చేసుకొనే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రత్యేక హోదా అంశం రాజకీయంగా ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.