పనితీరు ఆధారంగానే టిక్కెట్లు, సీల్డ్ కవర్లో నివేదికలు: లోకేష్ సంచలనం
అమరావతి: పనితీరు బాగా లేని ప్రజా ప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం కష్టమేనని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.పనితీరును ఇప్పటికైనా మార్చుకోవాలని ఆయన సూచించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తాము చేసిన ఆరోపణలను ఆధారాలతో రుజువు చేస్తామన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చేసిన ఒక్క ఆరోపణనైనా నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు.
కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని సమయాల్లో ఇరు పార్టీలకు చెందిన నేతలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలకు కూడ దిగుతున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పిఎంఓ కార్యాలయం చుట్టూ తిరగడాన్ని టిడిపి నేతలు తప్పుబడుతున్నారు. ఈ విషయమై రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ తరుణంలోనే ఈ విషయమై ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ సోమవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు.

పనితీరు బాగా లేకపోతే టిక్కెట్లు లేవు
రాష్ట్రంలో టిడిపికి చెందిన ప్రజాప్రతినిధుల పనితీరుపై సీల్డ్ కవర్లో నివేదికలు ఇస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. పనితీరు బాగా లేని ప్రజాప్రతినిదులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కష్టమేనని ఆయన ప్రకటించారు. పనితీరు బాగా లేని నేతలు తమ తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని లోకేష్ తేల్చి చెప్పారు.

విజయ్సాయి రెడ్డిపై ఆరోపణలు రుజువు చేస్తాం
వైసీపీ ఎంపీ విజయ్సాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడపై, టిడిపి నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. తమ పార్టీ నేతలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో సహ రుజువు చేస్తామని లోకేష్ చెప్పారు. రేపో మాపో జైలుకు వెళ్లే వ్యక్తికి పీఎంవోలోకి తరచూ ఎలా ప్రవేశం లభిస్తోంది? అని కేంద్రాన్ని నిలదీశారని లోకేష్ గుర్తు చేశారు.

విజయ్సాయి రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు
రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో మాట్లాడితే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి అనుకూలంగా మాట్లాడారన్న విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్ రాగానే తొలుత అద్భుతమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేనని ఆయన ప్రస్తావించారు. పీఎంవోలో చక్కర్లు కొట్టేవారు హోదా కావాలని మోదీని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. మోదీ సభకు వస్తే నిలదీయకుండా పరారవుతున్నారని, లేకపోతే కాళ్లమీద పడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎవరు పోరాడుతారు
ఏపీ రాష్ట్ర హక్కుల కోసం ఎంపీలు పోరాటం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏపీ రాష్ట్ర హక్కుల విషయమై ఎవరు పోరాటం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ, బిజెపి నేతల ఆరోపణల్లో సారూప్యత ఉందన్నారు.ఈ రెండు పార్టీలు లోపాయికారీగా ఒప్పందం చేసుకొన్నట్టుగా ఉన్నట్టు కన్పిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications