వైజాగ్లో భూములు లేవు, ఏ ఒక్క అధికారికి ఫోన్ చేయలేదు, వారిపై క్రిమినల్ కేసులు: విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్టణం మారబోతుందన్న ఊహాగానాల నేపథ్యంలో అక్కడ రియల్ భూం పుంజుకుంటోంది. అయితే వివాదాస్పద భూములపై కన్నేసిన కొందరు, ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనుకొంటున్నారు. ఇందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. విశాఖపట్టణంలో తనకు ఎలాంటి భూములు లేవని చెప్పారు. ఇప్పుడే కాదు గతంలో కూడా తాను ఏ అధికారికి కూడా ఫోన్ చేయలేదని స్పష్టంచేశారు.
భూమి లేదు..
విశాఖపట్టణంలో తనకు ఎలాంటి భూములు లేవని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ఉన్న వివాదాస్పద భూముల గురించి తాను ఏ అధికారికి ఫోన్ చేయలేదని స్పష్టంచేశారు. ఇక్కడ భూమి ఉంది, పరిష్కరించాలని చెప్పలేదని, భవిష్యత్లో కూడా చెప్పబోనని స్పష్టంచేశారు. ఇది తన నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలా ఎవరైనా చెబితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి అధికారులను కోరారు.
క్రిమినల్ కేసులు
సంబంధిత అధికారులు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని, న్యాయ ప్రకారం తమ విధులు నిర్వహిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందులో రాజకీయ జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. ఒకవేళ తన పేరు చెప్పి వచ్చిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని విశాఖపట్టణం కలెక్టర్, పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ను విజయసాయిరెడ్డి కోరారు.
చెడ్డపేరు
ఆయా భూముల్లో విజయసాయిరెడ్డికి భాగస్వామ్యం ఉందని కొందరు వచ్చి చెప్పారని తన దృష్టికి వచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కానీ తనకు విశాఖలో భూములు లేవని, దీంతోపాటు తాను ఎవరికీ చెప్పలేదని చెప్పారు. ఏ ఒక్క అధికారికి ఫోన్ కూడా చేయలేదని పేర్కొన్నారు. తన పేరు చెప్పిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలా కొందరు చేసే పనుల వల్ల తనతోపాటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తోందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.
అప్రమత్తం..
విశాఖపట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం 394.50 కోట్లు విడుదల చేసిన వెంటనే ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. దీంతో విశాఖలో రియల్ భూం నడుస్తోందని, కొందరు పెద్దల పేరుతో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. బాధితులు బయటకు రాకపోయినా.. జనాల్లో మాత్రం రియల్ భూం దోపిడీకి సంబంధించి చర్చ జరుగుతుంది. దీనిపై మీడియాలో రచ్చ కాకముందే విజయసాయిరెడ్డి స్పందించి, తనకేం తెలియదు అని చెప్పే ప్రయత్నం చేశారు.