ప్రత్యేక హోదా కంటే ముందే విజయవాడ మెట్రోపై ఏపీకి కేంద్రం షాక్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజుల క్రితమే ఏపీకి మరో ఝలక్ ఇచ్చింది. విజయవాడ నగరానికి మెట్రో రైలు లేదని తేల్చి చెప్పింది.
మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలంటే ఏ నగరంలో అయినా కనీసం 20 లక్షల జనాభా ఉండాలి. కానీ విజయవాడలో 15 లక్షల కంటే తక్కువ జనాభా ఉంది.
రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి విజయవాడ అనర్హమని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజుల ముందే లేఖ రాసింది. కేంద్రం పంపిన లేఖ ప్రకారం... ఏదైనా పట్టణంలో మెట్రో రైలు నిర్మించాలంటే 20 లక్షల మంది జనాభా కలిగి ఉండాలని, విజయవాడ జనాభా అంత లేదని పేర్కొంది.
అంతే కాకుండా 2019 - 2020 నాటికి రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగేలా విజయవాడ కనిపించడం లేదని పేర్కొంది. విజయవాడ మెట్రో రైలు డీపీఆర్ను (డిటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) పరిశీలించిన కేంద్రం, కేంద్రం నుంచి ఆర్థిక సాయం పొందేందుకు అర్హతలు లేవని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
అలాగే డీపీఆర్లో భద్రత, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, మల్టీ మోడల్ రంగాల్లో ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించలేదని కేంద్రం చెప్పింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణకు పన్నులు, సెస్లు విధించే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పొందుపరచలేదని తెలిపింది.
ఏపీ ఆర్థిక వ్యవహారాల్లో నిలకడత్వం లేదని లోపాలు ఎత్తి చూపింది. మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇరవై శాతానికి మించదని, అది కూడా భూసేకరణకు అవసరమయ్యే ఖర్చుతో సంబంధం లేదని పేర్కొంది.