లై డిటెక్టర్ అవసరంలేదు: అంబటి, బాబు వద్దకు సలహాదారులు.. గవర్నర్ స్పందించారా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకొని హుందాగా వ్యవహరించాలని వైయస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం అన్నారు.ఓటుకు నోటు కేసులో రోజుకో ఆధారాలు దొరుకుతున్నాయని చెప్పారు.
చంద్రబాబుకు ప్రత్యేకంగా లై డిటెక్టర్ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. నేరాన్ని ఆయన అంగీకరించినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫోన్ ట్యాప్ చేయలేదని చంద్రబాబు చెప్పారన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నేరాన్ని అంగీకరించి జ్యూడిషియల్ విచారణకు కోర్టు ముందుకు వెళ్లాలన్నారు. ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చంద్రబాబు విచారణకు అంగీకరించాలని సూచించారు.
ఈ కేసు రెండు రాష్ట్రాలకు సంబంధించినది కాదన్నారు. ఫోన్ ట్యాప్ అయిందని, సెక్షన్ 8 అంటూ ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక వర్గం మీడియా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఏపీలో దోచి తెలంగాణలో తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమిపూజ, తెలంగాణ రాష్ట్రంలో ధనపూజ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తెలంగాణలో ఓ సాధారణ పౌరుడేనని చెప్పారు. ఏపీకి మాత్రమే ముఖ్యమంత్రి అని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుకు సెక్షన్ 8 ఎందుకు గుర్తుకు రాలేదో చెప్పాలన్నారు.
చంద్రబాబుతో గవర్నర్ సలహాదారుల భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు గవర్నర్ నరసింహన్ సలహాదారులను పంపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆరోపణలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ స్పందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వద్దకు సలహాదారులను పంపించారు.
చంద్రబాబుతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ సలహాదారులు ఏపీబీఎన్ శర్మ, ఏకే మహంతి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి రాజధానిలో, ఏపీ పైన తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిలో భద్రతాంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది.