సమైక్యానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టండి: శోభానాగి రెడ్డి
హైదరాబాద్: సమైక్యాంధ్ర పైన తమ పార్టీని ప్రశ్నించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యురాలు శోభా నాగి రెడ్డి గురువారం అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగి రెడ్డి, ఇతర నేతలు విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం తాము అందరికంటే ముందుగానే రాజీనామాలు చేశామని, అలాంటప్పుడు తమను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదన్నారు.
విభజన విషయంలో ఎవరివి డ్రామాలో అసెంబ్లీని సమావేశపరుస్తే తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల వైఖరి విభజనపై ఏమిటో తెలియాల్సి ఉందన్నారు. అలాగే తమ స్టాండు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్ను ఎమ్మెల్యేలము కలుస్తామని చెప్పారు.
విభజన జరిపింది కాంగ్రెసు పార్టీ అని, లేఖ ఇచ్చింది టిడిపి అని ఆరోపించారు. తాము ఓ ప్రాంతంలో నష్టం జరుగుతున్నప్పటికీ సమైక్యవాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏ పార్టీ చేయనట్లుగా తాము ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేశామన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిరణ్ ఈ రోజు సమైక్యవాదినంటూ కొత్తగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ పార్టీ చేయకున్న తమ పార్టీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు కూడా చేశారన్నారు.
మూడు డిమాండ్లు
విభజన నిర్ణయం నేపథ్యంలో అసెంబ్లీని వెంటనే సమావేశ పర్చాలి, సమైక్యాంధ్రపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, పాస్ చేయించిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపించి ఆ తర్వాత రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలనే మూడు డిమాండ్లు తాము చేస్తున్నామన్నారు. తాము సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్ను కలుస్తామని, అపాయింటుమెంట్ దొరికితే గవర్నర్ను కలుస్తామని చెప్పారు. కాగా, తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం సూచనల మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదింప చేసుకునేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు రావడంతో వారు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.